శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (11:09 IST)

మహ్మద్ షమీకి కరోనా వైరస్ - టీ20కి దూరం

shami
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కరోనా వైరస్ బారినపడ్డాడు. దీంతో ఆసీస్ పర్యటన నుంచి తప్పుకున్నాడు. మరో రెండు రోజుల్లో సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో జట్టు షమీ లాంటి కీలక ఆటగాడిని కోల్పోయింది. దీంతో అతను జట్టుతో కలవలేదు. పైగా, అతని స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. 
 
అయితే, ఉమేశ్ యాదవ్ గాయం నుంచి కోలుకున్నప్పటికీ ఎన్సీఏలో రిహాబిలిటేషన్‌కు హాజరుకావాల్సి ఉంది. కానీ, షమీ స్థానాన్ని భర్తీ చేసేందుకు అతను మొహాలీ చేరుకోనున్నాడు. మంగళవారం మొహాలీలోని పీసీఏ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 జరుగుతుంది. ఇందులో తుది జట్టులో చోటుదక్కితే ఉమేశ్ రెండేళ్ల తర్వాత తిరిగి టీ20 మ్యాచ్ ఆడినట్టు అవుతుంది.
 
మరోవైపు కొన్నాళ్లుగా పొట్టి ఫార్మాట్‌కు షమీని దూరంగా ఉంచిన సెలెక్టర్లు టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని, ఆస్ట్రేలియాతో పాటు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లకు ఎంపిక చేశారు. టీ20 వరల్డ్ కప్ లోనూ షమీని స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంచుకున్నారు. 
 
ఒకవేళ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20ల్లో సత్తా చాటితే వరల్డ్ కప్‌లో ఎవరైనా గాయపడితే షమీని ప్రధాన జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కరోనా బారిన పడిన షమీ కోలుకునేందుకు కనీసం వారం పట్టే అవకాశం ఉంది. ఈ లెక్కన ఈ నెల 20, 23, 25వ తేదీల్లో జరిగే ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో అతను బరిలోకి దిగేది అనుమానమే.