1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (08:33 IST)

నరాలు తెగే ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం.. ఫైనల్లో భారత్‌తో ఢీ

asia cup
ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా గురువారం ఆతిథ్య శ్రీలంక పాకిస్థాన్ జట్ల మధ్య నరాలు తెగే ఉత్కంఠ పోరులో మ్యాచ్ జరిగింది. ఇది భారత్ - పాకిస్థాన్‌కు మించిన పోరుగా జరిగింది. ఆఖరి బంతి వరకు క్రికెట్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. చివరకు పాకిస్థాన్‌కు షాకిచ్చిన శ్రీలంక... విజయం సాధించింది. ఫలితంగా 11వసారి ఫైనల్లో ప్రవేశించింది. ఆదివారం జరిగే తుదిపోరులో భారత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 
 
డక్ వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం 42 ఓవర్లలో 252 పరుగుల ఛేదనను చేపట్టిన శ్రీలంకను తన అసమాన బ్యాటింగ్‌తో చరిత అసలంక (49 నాటౌట్) విజయ తీరాలకు చేర్చాడు. అంతకుముందు కుశాల్ మెండిస్ (91), సమరవిక్రమ (48) అద్భుత ఆటతో జట్టును విజయానికి చేరువ చేశారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42 ఓవర్లలో 252/7 స్కోరు చేసింది. వర్షం వల్ల రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను తొలుత 45 ఓవర్లకు కుదించారు. 
 
ఆపై.. పాకిస్థాన్ ఇన్నింగ్స్ 28వ ఓవర్ తర్వాత మరోసారి వరుణుడు అడ్డుకోవడంతో ఆట ఇంకో 40 నిమిషాలు ఆగింది. ఫలితంగా మ్యాచ్ ఓవర్లను మరోసారి కుదించారు. వికెట్ కీపర్, బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (86 నాటౌట్), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (52) అర్ధ శతకాలతో సత్తా చాటగా ఇప్లికార్ అహ్మద్ (47) రాణించాడు. పదిరన మూడు, ప్రమోద్ రెండు వికెట్లు తీశారు. 
 
ఆ తర్వాత ఓవర్‌కు ఆరు పరుగుల లక్ష్యంతో ఛేదనను చేపట్టిన శ్రీలంకకు పాకిస్థాన్‌కు ఆదిలోనే ఝలక్ ఇచ్చింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో పెరీరా (17) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇదే ఓవరులో నిస్సంక రెండు బౌండరీలతో స్కోరులో వేగం పెంచాడు. శ్రీలంక తరపున కుశాల్ మెండీస్ 91 పరుగులు చేశాడు. సమరవిక్రమ 48 రన్స్ చేశాడు. చివరి రెండు బంతులకు ఆరు పరుగులు కావాల్సి రావడంతో అసలం ఒక ఫోర్లు, మరో బంతికి రెండు పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఫలితంగా ఆదివారం జరిగే మ్యాచ్‌లో భారత్‌తో శ్రీలంక తలపడుతుంది.