శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 మార్చి 2020 (16:16 IST)

ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచకప్- ఆస్ట్రేలియా వుమెన్స్‌కే కప్.. భారత్‌కు చుక్కెదురు

Australia
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత మహిళలు ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచ కప్‌ను దేశానికి అంకితం ఇస్తారనుకున్న క్రికెట్ ఫ్యాన్సుకు నిరాశ ఎదురైంది. ఆదివారం భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన టీ-20 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా 85 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. భారత మహిళలు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో డీలా పడిపోయారు. దీంతో ఆస్ట్రేలియా ఐదోసారి వరల్డ్ కప్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. 
 
బౌలింగ్‌లో దారుణ ప్రదర్శన కనబర్చిన భారత మహిళలు.. బ్యాటింగ్‌లో ఇంకా ఘోరంగా విఫలమయ్యారు. ప్రత్యర్థి భారీ లక్ష్యాన్ని చూసే సగం జడుసుకున్నారు. ఫలితంగా వరుసగా టీమిండియా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. పరుగులు సమర్పించుకోవడంలో బౌలర్లు పోటీపడితే.. వికెట్లు ఇచ్చుకోవడంలో బ్యాట్స్‌వుమెన్ తలపడ్డారు.
 
లీగ్ మ్యాచ్‌ల్లో చెలరేగిన షెఫాలీ వర్మ.. కీలక సమరంలో మాత్రం చేతులెత్తేసింది. కేవలం మూడు బంతులే ఆడి రెండు పరుగులే చేసి తొలి వికెట్‌గా వెనుదిరిగింది. మరుసటి ఓవర్లలోనే జెమీమా రోడ్రిగ్స్(0) ఔటైంది. తర్వాత వరుస ఫోర్లతో జోరు కనబర్చిన మంధాన.. జొనస్సెన్ బౌలింగ్‌లో డీప్ స్క్వేర్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. 
India Women
 
అనంతరం హర్మన్ ప్రీత్ కౌర్(4) కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ బాట పట్టింది. 30 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో వేదకృష్ణమూర్తి, దీప్తి శర్మ నిలకడగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ చివరికి భారత్ వుమెన్ లక్ష్యాన్ని చేధించలేక పోయారు. 
 
భారత బ్యాట్స్‌వుమెన్లలో అత్యధికంగా షెఫాలీ వర్మ 33 పరుగులు సాధించింది. దీంతో 19.1 ఓవర్లలో భారత వుమెన్స్ 99 పరుగులకే ఆలౌటైంది. ఆసీసీ వుమెన్ బౌలర్లలో ష్యూట్ 4, జోనాస్సెన్ 3, మొలినెక్స్, కిమ్మినిస్, కారే తలా ఒక్కో వికెట్ తన ఖాతాలో వేసుకున్నారు.