గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 మార్చి 2020 (14:54 IST)

వరల్డ్ కప్ గెలవాలంటే.. అద్భుతం జరగాలి.. ఆసీస్ కుమ్మేసింది.. మరి భారత్?

Womens world cup final
భారత మహిళలు.. ప్రపంచకప్ తుది పోరులో ఘోరంగా విఫలమయ్యారు. అదే సమయంలో కసి, పట్టుదల, ఓపిక చూపెట్టిన ఆస్ట్రేలియా.. భారత్ ముందు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. బౌలింగ్‌లో భారత మహిళలు చేతులెత్తేయడంతో ఆస్ట్రేలియా మహిళలు అదరగొట్టేశారు. ఆదివారం మహిళా దినోత్సవం కావడంతో మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
 
భారత టీం క్యాప్టెన్ హర్మన్ ప్రీత్ పుట్టిన రోజు కావడం‌తో మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కంగారులను ఓడించి భారత మహిళలకు ఉమెన్స్ డే కానుకగా, కేప్టెన్ హర్మన్ ప్రీత్‌కు భర్త్ డే కానుక ఇవ్వాలన్న ఉత్సాహంలో భారత టీం వుంది. 
 
ఈ టోర్నీలో హాట్ ఫెవరేట్‌‍గా ఆస్ట్రేలియా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు నాలుగు సార్లు వరల్డ్ కప్ గెలిచింది. ఆస్ట్రేలియా ఫైనల్‌కు రావడం ఇది ఆరోసారి. అయితే భారత్ మహిళల టీట్వంటీ ప్రపంచకప్‌లో ఇంత వరకు కప్ గెలవలేదు. ఈసారి భారత మహిళ టీం లీగ్ దశలో అన్ని టీంలను మట్టికరిపించి హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. 
 
ఈ క్రమంలో ఆదివారం ఫైనల్ ప్రారంభం కాగానే ఆస్ట్రేలియా సత్తా చాటింది. బ్యాటింగ్‌లో అదరగొట్టింది. బౌలింగ్, ఫీల్డింగ్‌లో చేతులెత్తేసిన భారత్‌కు చుక్కలు చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా క్రీడాకారిణుల్లో అలీసా హెలీ( 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 75), బెత్ మూనీ (54 బంతుల్లో 10 ఫోర్లు 78 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. పరుగులివ్వడంలో పోటీపడ్డ భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా.. పూనమ్ యాదవ్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
 
బ్యాటింగ్‌లో అద్బుతం చేస్తే మినహా భారత మహిళలు తమ చిరకాల కలను సాకారం చేసుకోలేని పరిస్థితిని తెచ్చుకున్నారు. రెండేళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. చెలరేగిన రీతిలో మరోసారి రాణిస్తేనే భారత్ చిరస్మరణీయ విజయాన్నందుకుంటుంది. లేకుంటే మరోసారి నిరాశగా వెనుదిరగక తప్పదు.