ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2020 (15:26 IST)

ఐపీఎల్ టోర్నీపై కరోనా వైరస్ ఎఫెక్టు... జరిగేనా... వాయిదాపడేనా?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇపుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఐపీఎల్ తాజా సీజన్ మార్చి 29వ తేదీన ఆరంభంకావాల్సివుంది. అయితే దేశంలో ప్రవేశించిన కరోనా మహమ్మారి అనేక రాష్ట్రాలకు విస్తరిస్తుండటంతో ఈ నెలాఖరు నాటికి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఐపీఎల్ సజావుగా ఆరంభమవుతుందా అన్నది మిలియన్ డాలర్ల సందేహంగా నిలిచింది. 
 
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా పోటీలు కరోనా భయంతో వాయిదాపడ్డాయి. మలేసియా వేదికగా ప్రతి ఏడాది జరిగే అజ్లాన్ షా హాకీ టోర్నీ వాయిదాపడింది. నేపాల్‌లో జరగాల్సిన ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలకు సైతం కరోనా తాకిడి తప్పలేదు. 
 
ఈ టోర్నీ రీషెడ్యూల్ చేసేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. భారత్‌లో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో మరికొన్ని వారాల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపైనే ఐపీఎల్ తాజా సీజన్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. 
 
ఎందుకంటే, ఐపీఎల్ మ్యాచంటే వేలల్లో అభిమానులు స్టేడియాలకు వస్తుంటారు. గ్యాలరీల్లో క్రిక్కిరిసిన జనసందోహాల నడుమ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం దుస్సాధ్యమనే చెప్పాలి. ఓవైపు ఫ్రాంచైజీలన్నీ తమ ఆటగాళ్లతో సన్నాహాలు షురూ చేశాయి కానీ, లోలోపల భయం పీడిస్తూనే ఉంది.