శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (16:55 IST)

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ రేసులో వారిద్దరు? ఎవరు? (Video)

భారత క్రికెట్ జట్టుకు కొత్త చీఫ్ సెలెక్టరు పదవికి కొత్తవారిని ఎంపిక చేయనున్నారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన ఎంఎస్కే ప్రసాద్ పదవీకాలం ఇటీవలే ముగిసింది. దీంతో ఆ స్థానానికి కొత్తవారిని ఎంపిక చేసే ప్రక్రియకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు శ్రీకారం చుట్టింది. 
 
కొత్త సెలక్టరును ఎంపిక చేసే బాధ్యతలను ఆర్పీ సింగ్, మదన్ లాల్, సులక్షణ నాయక్‌లతో కూడిన కమిటీకి బీసీసీఐ అప్పగించింది. నియామకానికి ఎటువంటి కాల పరిమితినీ పెట్టలేదు. కానీ అన్ని రకాల వడపోత కార్యక్రమం తర్వాత మాజీ పేస్ బౌలర్లు అజిత్ అగార్కర్, వెంకటేశ్ ప్రసాద్‌లతో పాటు లెగ్ స్నిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, రాజేశ్ చౌహాన్‌లు తుదిరేస్‌లో నిలిచారు. 
 
కాగా, కొత్త సెలక్టర్ నియామకం మార్చి తొలివారంలోపు జరుగుతుందని మదన్ లాల్ వెల్లడించారు. తుది దశ ఇంటర్వ్యూలకు నలుగురు మిగిలారని అన్నారు. ఇదిలావుండగా, అత్యంత అనుభవజ్ఞుడిని మాత్రమే ఎంపిక చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
 
దీంతో ఈ పదవికి ప్రధానంగా అగార్కర్, వెంకటేశ్ ప్రసాద్ మధ్యే పోటీ ఉంటుందని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి. టెస్టుల్లో వెంకటేశ్ ప్రసాద్, వన్డేల్లో అజిత్ అగార్కర్‌లు ఎక్కువ మ్యాచ్‌లను ఆడారు. 
 
టెస్టుల అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే వెంకటేశ్ ప్రసాద్‌కు, ఇంటర్నేషనల్ టీ-20ల అనుభవం కూడా పరిశీలిస్తే ఆగార్కర్‌కు అవకాశాలు ఉంటాయనడంలో సందేహం లేదు. ఇక వీరిద్దరిలో ఎవరు కొత్త సెలక్టర్ అవుతారన్నది తెలియాలంటే మరో రెండు వారాలు ఆగక తప్పదు.