శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2020 (19:18 IST)

భారత్-పాక్ క్రికెట్ సిరీస్.. యువీకి కౌంటరిచ్చాడు.. ఉగ్రవాదులు క్రికెట్‌ను కూడా? (video)

భారత్-పాకిస్థాన్‌ మధ్య సిరీస్ జరగాలని టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ఆకాంక్షించాడు. 2004, 2006, 2008 పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం తనకు గుర్తుందని.. ప్రస్తుతం అలాంటి మ్యాచ్‌లు ఆడే పరిస్థితులు వున్నాయని చెప్పాడు.

కానీ, అది మన చేతిలో లేదు. మనందరం క్రికెట్‌ను ప్రేమిస్తామని తెలిపాడు. కానీ, మన ప్రత్యర్థులు ఎవరు అనేది మనం నిర్ణయించలేం. ఒకవేళ ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌ జరిగితే.. అది ఆటకి ఎంతో ఉపయోగపడుతుందని యువీ వ్యాఖ్యానించాడు.
 
కాగా.. ముంబై పేలుళ్ల అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగలేదన్న సంగతి తెలిసిందే. కేవలం ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్‌లలో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. కానీ భారత్‌తో కలిసి మళ్లీ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు పాక్ ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసిన బీసీసీఐ మాత్రం అందుకు అంగీకరించలేదు. మరోవైపు కొందరు మాజీలు మాత్రం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరిస్‌ జరిగాలని కోరుతూ వస్తున్నారు. ప్రస్తుతం యువీ కూడా ఇండో-పాక్ జరగాలని తెలిపాడు.
 
అయితే భారత్-పాక్ మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగవద్దని భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ అన్నాడు. ఇటీవల యువీ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చాడు.

క్రికెట్‌పై అభిమానుల ఆసక్తి పెంచడానికి.. భారత్-పాక్ జట్లు ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు కృషి చేయాలని యువీ చెప్పిన నేపథ్యంలో.. పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడటం మంచిది కాదు. ఉగ్రవాదులు క్రికెట్‌ను కూడా వదిలిపెట్టరు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులున్నంత కాలం ఇరు దేశాల మధ్య క్రికెట్ ఆడకూడదని చేతన్ అభిప్రాయం తెలిపాడు.