1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2023 (16:33 IST)

ఆసియా కప్: భారత్ వర్సెస్ నేపాల్ మ్యాచ్ రద్దయితే...

Old Trafford stadium
ఆసియా క్రికెట్ కప్ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యమిస్తుంది. అయితే, ఈ టోర్నీకి వర్షం ముప్పు పొంచివుంది. ఇప్పటికే కీలకమైన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో తలో పాయింట్‌ను కేటాయించారు. ఈ నేపథ్యంలో సోమవారం భారత్ నేపాల్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు కూడా వరుణ గండం తప్పేలా లేదు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటన్నది ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా, గ్రూప్‌ 4 పరిస్థితి ఏంటి? అనే చర్చ మొదలైంది. నేపాల్‌ మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దయితే ఎవరు సూపర్‌-4లోకి అడుగుపెడతారు, ఆ లెక్కేంటో చూద్దాం.
 
చిరకాల ప్రత్యర్థులు భారత్‌ - పాకిస్థాన్‌ శనివారం జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది. అప్పటికే నేపాల్‌పై ఘన విజయం సాధించిన పాక్‌.. సూపర్‌ 4లోకి అడుగుపెట్టింది. మరోవైపు సోమవారం అదే పల్లెకెలె వేదికగా నేపాల్‌తో భారత్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌పై కూడా వరుణుడి ప్రభావం ఉండే అవకాశాలున్నట్లు వాతావారణ నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే మైదానం ఓవైపు అంతా మేఘావృతమైవుంది. 
 
నేపాల్‌ మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దు అయితే.. ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభిస్తుంది. అప్పుడు భారత్ 2 పాయింట్లతో నేపాల్‌ కంటే ముందుంటుంది. దీంతో భారతే సూపర్‌ 4లోకి అడుగుపెడుతుంది. అప్పుడు గ్రూప్‌ ఏ నుంచి భారత్‌, పాక్‌ సూపర్‌ 4కు చేరుకున్న జట్లుగా నిలుస్తాయి. ఒకవేళ నేపాల్‌ సూపర్‌ 4కు వెళ్లాలంటే.. భారత్‌పై తప్పక విజయాన్ని నమోదు చేయాలి. అలాగే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించకూడదు.
 
దీంతో మ్యాచ్‌ సజావుగా సాగాలని ఆ దేశం అభిమానులు కోరుకుంటున్నారు. అయితే.. పసికూన నేపాల్‌పై టీమ్‌ఇండియా గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మ్యాచ్‌ జరిగి ఆ జట్టుపై ఘనవిజయం సాధించాలనే టీమ్‌ఇండియా కోరుకుంటోంది. నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.