నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు
మేఘాలయ హనీమూన్ హత్య ఉదంతం కుదిపేస్తుండగానే బెంగళూరులో మరో దారుణం జరిగింది. ఓ సాఫ్ట్వేర్ టెక్కీతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వివాహితను ఆమె ప్రియుడు అత్యంత దారుణంగా 17 సార్లు పొడిచి హత్య చేసాడు. సోమవారం బెంగళూరులో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. తన భర్త అనుమానం వచ్చిందనీ, ఇక మనం ఇద్దరం కలుసుకోవడం ఆపేద్దామంటూ ఆమె చెప్పడంతో ఆగ్రహం చెందిన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఆమెను 17 సార్లు పొడిచి చంపాడు.
ఈ సంఘటన సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పూర్ణప్రజ్ఞ లేఅవుట్లోని ఒక హోటల్ గదిలో జరిగిందని పోలీసులు తెలిపారు. మృతురాలిని 36 ఏళ్ల హరిణిగా, నిందితుడిని 25 ఏళ్ల యష్ అనే టెక్నీషియన్గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హరిణికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిందితుడితో వివాహేతర సంబంధం కలిగి వుంది.
యష్, హరిణి ఒక ఫెయిర్లో కలుసుకున్నారని, పరస్పరం ఇద్దరు తమ ఫోన్ నంబర్లు మార్చుకున్నారనీ, చాటింగ్ ప్రారంభించారని పోలీసు దర్యాప్తులో తేలింది. వారి సంబంధం డేటింగ్కు దారితీసింది. చివరికి శారీరక సంబంధానికి దారితీసింది. తరచూ తన భార్య ఫోనులో మాట్లాడుతూ వుండటం, తను చూసినప్పుడల్లా ఆందోళనగా వుండటంతో హరిణి భర్తకు అనుమానం వచ్చింది. ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకుని, ఆమెను ఇంటి నుండి బయటకు వెళ్లకుండా నిషేధించాడు.
దీంతో హరిణిని కలిసే అవకాశం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ వచ్చాడు యష్. చివరికి నెలల తర్వాత హరిణి తన ఇంటి నుంచి ఎలాగో యశష్ను ఓ ప్రైవేట్ హోటల్ గదిలో కలిసింది. ఇద్దరూ ఏకాంతంగా గడిపిన తర్వాత ఇక తనను కలిసే ప్రయత్నం చేయవద్దనీ, ఇకపై ఎవరిదారిన వారిన వుందామంటూ హరిణి చెప్పింది. ఐతే హరిణి నుండి శాశ్వతంగా విడిపోవడాన్ని తట్టుకోలేని యషాస్ మనస్తాపానికి గురై ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు.
చివరిసారిగా మనిద్దరం ఏకాంతంగా గడుపుదామని ఆమెను ఓ ప్రైవేటు లాడ్జికి తీసుకెళ్లాడు. ఆమెతో సన్నిహితంగా గడిపిన తర్వాత, నిందితుడు హోటల్ నుండి పారిపోయే ముందు ఆమెను కత్తితో పదే పదే పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి మృతదేహాన్ని నగ్నంగా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితుడు ఆమె మెడ, ఛాతీ, పొట్ట ఇంకా ఇతర భాగాలపై కత్తితో పొడిచాడు. నిందితుడు తరువాత తన ఇంటికి వెళ్లి తన చేయి కోసుకుని ఆత్మహత్య యత్నానికి కూడా ప్రయత్నించాడు. అయితే నిందితుడు మనసు మార్చుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
36 ఏళ్ల హరిణి తనతో వున్న సంబంధాన్ని ముగించేద్దామని అన్నందుకే తట్టుకోలేక ఆమెను కత్తితో పొడిచి చంపాడని డిసిపి లోకేష్ తెలిపారు. 25 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన నిందితుడు, వారు కలవడానికి ముందే ఆమెను చంపడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాడు. అతను మొదట కత్తిని కొని, తరువాత ఆమెను కలిశాడు. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.