గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

తల్లి సహకారంతో ప్రియుడితో కలిసి తండ్రిని చంపేసిన కుమార్తె..

mother and daughter
కన్న తల్లి తన వంతు సహకారం అందించడంతో ప్రియుడితో కలిసి కన్నతండ్రిని ఓ కసాయి కుమార్తె అనంతలోకాలకు పంపించింది. ఆ తర్వాత హత్యగా చేసేందుకు తల్లీకుమార్తె ప్రయత్నం చేశారు. ఈ హత్యకు ముందు పలుమార్లు దృశ్యం సినిమాను చూశారు. ఆ తర్వాత తన భర్యను ఎవరో హత్య చేశారంటూ భార్య ఫిర్యాదుతో ఈ వషయం వెలుగులోకి వచ్చింది. అయితే, తల్లీ కుమార్తె ప్రవర్తపై అనుమానంతో వారి మొబైల్ కాల్ డేటాను పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని బెళగావిలో జరిగింది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... నగరానికి చెందిన సుధీర్ కాంబ్లే (57) అనే వ్యక్తికి భార్య రోహిణి, కుమార్తె స్నేహలు ఉన్నారు. గతంలో దుబాయ్‌లో పని చేసిన సుధీర్ కరోనా తర్వాత నగరానికి వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో పూణెలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్న సమయంలో స్నేహకు అక్షయ్ విఠకర్ అనే యువకుడు పరిచయమయ్యాడు. అది క్రమంగా వారి మధ్య ప్రేమకు దారితీసింది. ఈ విషయాన్ని గమనించిన తండ్రి సుధీర్ కుమార్తెను మందలించాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురికావడంతో తన ప్రేమ సక్సెస్ కాదని భావించింది. 
 
తండ్రిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసి, ఈ విషయాన్ని తన తల్లికి కూడా చెప్పింది. ఆమె భర్తను హత్య చేసేందుకు సమ్మతించింది. దీంతో తన ప్రియుడిని కర్నాటక పిలిపించి ఓ లాడ్జీలో బస చేసేలా ఉంచింది. ఆ తర్వాత తమ ప్లాన్‍‌లో భాగంగా ఈ నెల 16వ తేదీ తండ్రి పై అంతస్తులో నిద్రిస్తుండగా, 17వ తేదీ తెల్లవారుజామున తల్లికుమార్తెలు అక్షయ్‌ను ఇంటికి పిలిచారు. 
 
ఆ తర్వాత ఆ ముగ్గురు సుధీర్ నిద్రపోతున్న గదిలోకి ప్రవేశించి, ఆయన కాళ్లను తల్లీకుమార్తెలు పట్టుకోగా, అక్షయ్ కత్తితో ఇష్టానుసారంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత పూణె వెళ్లిపోయాడు. కొంత సమయం తర్వాత తన భర్తను ఎవరో హత్య చేశారంటూ భార్య రోహిణి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. సినిమా ఫక్కీలో హత్య చేసినట్టు నిర్థారించారు. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి ఈ హత్య చేసేందుకు మోహన్ లాల్ నటించిన దృశ్యం చిత్రాన్ని అనేకు మార్లు చూసి, అందులో ఉన్నట్టుగా ప్లాన్ చేయడం గమనార్హం.