ఆంటీ అని దగ్గరయ్యాడు: అవి ఇవ్వు అన్నందుకు గుండెల్లో పొడిచిన ప్రియుడు
భర్తతో మనస్పర్థలు కారణంగా ఓ వివాహిత తన బిడ్డతో సహా అతడికి దూరంగా వుంటోంది. ఐతే భర్తతో విడిపోవడంతో పుట్టిన ఊరులోనే పని చేసుకుంటూ అక్కడే వుంటోంది. ఈ క్రమంలో అదే ఊరిలో వుంటున్న ఓ యువకుడి కన్ను పడింది. ఆంటీ అంటూ ఆమెకి పనుల్లో ఆసరాగా వుంటూ వస్తున్నాడు. అలా వీరిమధ్యలో పెరిగిన సాన్నిహిత్యం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ సంబంధాన్ని అడ్డుపెట్టుకున్న యువకుడు ఆమె నుంచి డబ్బు గుంజటం ప్రారంభించాడు. చివరికి వారి మధ్య తలెత్తిన గొడవలో తీవ్ర ఆగ్రహంతో ఆంటీ గుండెల్లో పొడిచి హత్య చేసాడు.
పూర్తి వివరాలను చూస్తే... మహారాష్ట్ర లోని అంబర్నాథ్ పరిధిలో సీమా కాంబ్లే తన కుమార్తెతో వుంటోంది. భర్తతో మనస్పర్థలు కారణంగా అతడికి దూరంగా వుంటోంది. ఐతే ఆమెకి అదే ప్రాంతానికి చెందిన రాహుల్ బింగార్కర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా సన్నిహిత సంబంధానికి దారి తీసింది. అలా వారిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఈ సమయంలో ఆమె వద్ద నుంచి రాహుల్ రెండున్నర లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఆ డబ్బుతో జల్సాలు చేసేవాడు. తనకు అవసరమైనప్పుడు డబ్బు తిరిగి ఇవ్వాలని సీమా అతడికి చెప్పింది.
ఇటీవల ఈ విషయాన్ని రాహుల్ కి గట్టిగా చెప్పింది. తనకు డబ్బు అవసరం అనీ, ఇచ్చేయాలని కోరింది. ఐతే రాహుల్ మాత్రం ఎంతకీ డబ్బు ఇవ్వలేదు. దీనితో సీమా కాంబ్లే అతడి వద్దకు వెళ్లి తనకు డబ్బు ఇవ్వలేకపోతే తనను పెళ్లి చేసుకోవాలంటూ కోరింది. అలా చేసుకోవాలంటే తనకు మరో 5 లక్షలు డబ్బు ఇవ్వాలంటూ కండిషన్ పెట్టాడు. ఇదంతా నచ్చని సీమా... పెళ్లివద్దు గిళ్లీవద్దు నా రెండున్నర లక్షల డబ్బు వెంటనే ఇచ్చేయమంటూ గట్టిగా అడిగింది.
ఆమె అంత గట్టిగా అడుగుతుండటంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలనుకున్న రాహుల్.. డబ్బు ఇస్తా తీసుకెళ్లంటూ ఆమెకి ఫోన్ చేసాడు. తను అంబర్నాథ్ రైల్వే స్టేషను బ్రిడ్జి పైన వేచి చూస్తున్నట్లు చెప్పాడు. దాంతో ఆమె అక్కడికి వెళ్లింది. ఐతే అతడు డబ్బు ఇవ్వలేదు... తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెను గుండెల్లో, పొట్టలో విచక్షణారహితంగా అందరూ చూస్తుండగానే పొడిచేసాడు. సీమా అక్కడికక్కడే రక్తపుమడుగులో కూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.