తాతను 73 సార్లు కత్తితో పొడిచి చంపేసిన సొంత మనవడు...
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో ప్రముఖ పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర్ ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు పాల్పడింది సొంత మనవడేనని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆస్తి కోసమే ఈ హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. సొంత తాత అయిన చంద్రశేఖర్ను 73 సార్లు కత్తితో పొడిచి హత్య చేసినట్టు తేలింది. ఈ దారుణానికి పాల్పడింది కీర్తితేజ.
మిగతా మనవల్ని చూసినట్టు తనను చూడలేదని కసితో ఈ దారుణానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది. ఇటీవల కంపెనీలో ఒక మనవడికి డైరెక్టర్గా చంద్రశేఖర్ నియమించారు. అదేసమయంలో కీర్తితేజ మాత్రం చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో కీర్తితేజను చంద్రశేఖర్ దూరం పెట్టాడు. అదేసమయంలో కీర్తి తేజ చెడు వ్యసనాలను చూసి డైరెక్టర్ పోస్టు ఇవ్వలేదు. దీంతో తాత చంద్రశేఖర్పై కీర్తితేజకు కోపం పెరిగిపోయింది. తనకు డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదనే కసితోనే కీర్తి తేజ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.