1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 6 జూన్ 2025 (22:31 IST)

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

cash seized
అడ్డదారులలో డబ్బు సంపాదించేయాలి, నెలల కాలంలోనే కోటీశ్వరులై పోవాలని కొంతమంది అలా దూకేస్తుంటారు. చేస్తున్న ఉద్యోగంలో ఎక్కడో చిన్న అవకాశాన్ని అడ్డంపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతుంటారు. మోసం దాగదు కదా... అది కాస్తా బైట పడటంతో బండారమంతా తెలిసిపోతుంది. ఇపుడు ఇలాంటి మోసాన్ని ఓ ప్రైవేట్ బ్యాంక్ మహిళా రిలేషన్ షిప్ మేనేజర్ చేసింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా ప్రాంతంలో వున్న ప్రైవేట్ బ్యాంకులో సాక్షి గుప్త అనే మహిళ రిలేషన్‌షిప్ మేనేజరుగు విధులు నిర్వహిస్తోంది. ఐతే స్వల్ప వ్యవధిలో కోటీశ్వరురాలైపోవాలని ఆలోచన చేసింది. అంతే ఆమె చూపు కాస్తా కస్టమర్లు తను పనిచేస్తున్న బ్యాంకు ఖాతాల్లో వేసుకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పడింది. దాంతో 2020 నుంచి మెల్లగా వంద ఖాతాలపై దృష్టి సారించింది. అవన్నీ ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసుకున్నవి కావడంతో ఆ ఖాతాలను డబ్బును విత్ డ్రా చేసేందుకు పథకరచన చేసింది. బ్యాంకు ఖాతాలతో లింక్ అయి వున్న ఆయా కస్టమర్ల మొబైల్ ఫోన్ నెంబర్లను మార్చేసింది.
 
ఆ ఖాతా నెంబర్లను తను ఏర్పాటు చేసుకున్న కొత్త సిమ్ కార్డులకు లింక్ చేసింది. దీనితో క్యాష్ విత్ డ్రా చేసినప్పుడల్లా ఓటీపి లింక్ ఖాతాదారులకు కాకుండా ఈమె ఏర్పాటు చేసిన నెంబరుకు వచ్చేది. వెంటనే ఓటిపి ఎంటర్ చేసేసి కావలసిన డబ్బును విత్ డ్రా చేసేసేది. అలా మొత్తం రూ. 4.5 కోట్ల మేర విత్ డ్రా చేసి ఆ డబ్బును షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసింది. ఐతే ఆమె అనుకున్నది ఒకటి అయినది మరొకటి. షేర్ మార్కెట్లో పెట్టిన డబ్బుకి రిటర్న్స్ వస్తే లాభాన్ని తను వుంచేసుకుని బ్యాంకులో తను విత్ డ్రా చేసిన మొత్తాన్ని వేద్దామనుకుంది.
 
కానీ అలా జరగలేదు. ఆమె పెట్టిన డబ్బు తిరిగి రాలేదు. దీనితో ఏం చేయాలో తెలియక తికమక పడ్డది. ఈలోపు బ్యాంకులో ఫిక్స్ డ్ వేసిన కస్టమర్ వచ్చాడు. తన ఖాతాలో వున్న డబ్బు గురించి ఆరా తీయగా... ఖాతా నుంచి డబ్బు మాయమైనట్లు కనిపించింది. దీనితో ఏదో తప్పు జరిగిందనుకున్న బ్యాంకు పైస్థాయి అధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు. అలా విచారణ చేయగానే ఆమె మోసం అంతా బైటపడింది. తన సోదరి పెళ్లిలో ఎంజాయ్ చేస్తున్న ఆమెను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. కోర్టు ముందు ప్రవేశపెట్టి అనంతరం ఆమెను రిమాండుకి తరలించారు.