పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!
తన అమ్మను కన్నతండ్రి ఎలా కొట్టి చంపేశాడో ఓ చిన్నారి బొమ్మలు గీసిమరీ చూపించింది. 'పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు. రాయితో తలపై కొట్టాడు. ఆపై గోనె సంచిలో వేసి దూరంగా విసిరేశాడు' అంటూ పేర్కొంది. తన అమ్మను చంపేసిన కన్నతండ్రిని ఓ చిన్నారి డ్రాయింగ్ వేసి చూపించి పోలీసులకు పట్టించింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీలో జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, ఝాన్సీ కొత్వాలి ప్రాంతంలోని శివ్ పరివార్ కాలనీ ప్రాంతంలో 27 యేళ్ల వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మృతురాలి నాలుగేళ్ళ కుమార్తెను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పాపా (నాన్న) అమ్ము కొట్టి ఉరివేశాడు. రాయితో తలపై బలంగా కొట్టాడు. ఆపై గోనె సంచిలో వేసి దూరంగా విసిరేశాడు. ముందు రోజు కూడా అమ్మను భయపెట్టడానికి నాన్న యత్నించాడు. అపుడు నేను.. "నువ్వు అమ్మను కొడితే నీ చేతులు విరిచేస్తాను" అని చెప్పాను. నాన్న ఎపుడూ అమ్మను కొడుతుండేవాడు. అందుకే చచ్చిపోయింది. నన్ను కూడా కొట్టేవాడు" అని చిన్నారి వివరించింది.
అంతేకాదు, డ్రాయింగ్ వేసి మరీ చూపించింది. చిన్నారి వాంగ్మూలంతో రంగంలోకి దిగిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడుని పట్టుకుని జైలుకు పంపించారు. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నకానుకలే కాదు.. పిల్లలు పుట్టిన తర్వాత కూడా అదనంగా కట్నం తేవాలంటూ వేధించాడు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో కొట్టి చంపేశాడు.