శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 4 డిశెంబరు 2020 (16:56 IST)

గురువంటే ఆయనే, గ్లోబల్ టీచర్ ప్రైజ్ రూ. 7 కోట్లు గెలుచుకున్న భారతదేశ ఉపాధ్యాయుడు

ప్రపంచ దేశాలలోని ఉపాధ్యాయులు పోటీపడే గ్లోబల్ టీచర్ అవార్డును మహారాష్ట్రకి చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్ సిన్హా దిసాలే గెలుచుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో అత్యంత ప్రభావం చూపిన ఉపాధ్యాయులను వర్కే ఫౌండేషన్ గుర్తించి ప్రతి ఏటా ఈ అవార్డును ఇస్తుంది.
 
ఈ అవార్డు కోసం 140 దేశాల నుంచి మొత్తం 12 వేల మందికి పైగా పోటీపడ్డారు. ఈ క్రమంలో లండన్ లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో గురువారం జరిగిన ఎంపిక కార్యక్రమంలో తుది దశ ఎంపికలో పది మంది నిలిచారు. వారిలో భారతదేశానికి చెందిన రంజిత్ విజేతగా నిలిచినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు వెల్లడించారు.
 
రంజిత్‌కు ఈ అవార్డు ఎలా వరించిందంటే.. 32 ఏళ్ల రంజిత్ ఉపాధ్యాయ వృత్తిని ఎంతో ఇష్టంతో చేపట్టారు. ఓ గోదాము, గోశాల మధ్య జీర్ణావస్థలో వున్న పాఠశాలను బాగు చేయించారు. పాఠాలను మాతృభాషలోకి తర్జుమా చేయించి పిల్లలకు బోధించారు. పిల్లలకు పాఠాలు బాగా అర్థమయ్యేలా ఆడియో, వీడియో, కథల రూపంలో తీర్చిదిద్ది, బాలలు పాఠశాలకు వచ్చేవిధంగా ప్రయత్నం చేసారు.
 
అంతేకాదు ఆయన పనిచేస్తున్న పాఠశాల పరిధిలో నూటికి నూరుశాతం బాలికలు చదువుకునేందుకు పాఠశాలకు వచ్చేవిధంగా ప్రయత్నించారు. బాల్యవివాహాలను నిరోధించారు. కులమతాలకు అతీతంగా విద్యార్థినివిద్యార్థులందరినీ తీర్చిదిద్దారు. పిల్లల్లో మేథోశక్తి పెంపెందించేందుకు ఎన్నో నూతన కార్యక్రమాలను చేపట్టారు. రంజిత్ వంటి ఉపాధ్యాయులు ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారుచేయగలరంటూ యునెస్కో అసిస్టెండ్ డైరెక్టర్ జనరల్ కొనియాడారు.
 
ఈ అవార్డు కోసం పోటీపడిన ఉపాధ్యాయులకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అభినందించారు. కాగా తనకు వచ్చిన ప్రైజ్ మనీలో సగ భాగాన్ని తనతో పోటీ పడిన తోటి ఉపాధ్యాయులకు ఇస్తున్నట్లు రంజిత్ పేర్కొన్నారు. అలాగే మిగిలిన మొత్తంతో వెనుకబడిన తరగతుల విద్యార్థుల కృషి కోసం నిధిని ఏర్పాటు చేస్తానని తెలిపారు.