మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : సోమవారం, 16 నవంబరు 2015 (16:06 IST)

ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు - పుదుచ్చేరిల్లో వర్షబీభత్సం... ఎటు చూసినా నీరే...

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాల తీవ్రత దృష్ట్యా 16 జిల్లాల్లో అన్ని విద్యాలయాలకు తమిళనాడు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వర్ష బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ఆయా ప్రభుత్వాలు ముమ్మరం చేశాయి. అలాగే, వర్ష బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 
 
కాగా, అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో అదివారం అర్థరాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తిరుపతి, తిరుమలలోనూ కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శ్రీకాళహస్తి వద్ద స్వర్ణముఖి నది ఉగ్రరూపం దాల్చింది. ఆరిణియార్‌, కృష్ణాపురం, బహుదా జలాశయాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. 
 
తిరుమలలో ఆదివారం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో జలాశయాల్లో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకుంది. గోగర్భం జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. పాపవినాశనం నుంచి నీటిని విడుదల చేసేందుకు తితిదే సిబ్బంది చర్యలు చేపట్టారు. కుండపోత వర్షాల కారణంగా తిరుమల రెండో ఘాట్‌లో భాషికారి సన్నిధి వద్ద రహదారి కుంగిపోయింది. అయితే వర్షం కారణంగా మరమ్మతు పనులకు అంతరాయం కలుగుతోంది. దీంతో లింక్‌ రోడ్డు ద్వారా వాహనాలను కొండపైకి అనుమతిస్తున్నారు. 
 
అలాగే, నెల్లూరు జిల్లాలోనూ ఆదివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు తదితర ప్రాంతాల్లో వర్షం కుండపోతగా కురుస్తోంది. జిల్లాలోని కైవల్య, పంబలేరు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీరు పోటెత్తడంతో అనేక గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. దీంతో జిల్లా అధికారులు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా వెంకటగిరిలో 24 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది.
 
 
ప్రకాశం జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొత్తపట్నం, సింగరాయకొండ, టంగుటూరు, ఉలవపాడు, ఒంగోలు మండలాల్లో వర్షం కురుస్తోంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అనంతపురం, కృష్ణా జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉభయగోదావరి జిల్లాల్లో వరి కోతలకు సిద్ధమైన సమయంలో వర్షం కురుస్తుడటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 
 
భారీ వర్షాల కారణంగా చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెన్నై నగర సమీపంలో రైళ్ల పట్టాలపై వర్షపు నీరు చేరింది. దీంతో చెన్నై- విజయవాడ మార్గంలో ప్రయాణించే అనేక రైళ్ళను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. చెన్నై-గూడూరు మార్గంలో వెళ్లే రైళ్లను చెన్నై-రేణిగుంట వైపు మళ్లిస్తున్నారు. చెన్నై-విజయవాడ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. పినాకిని ఎక్స్‌ప్రెస్‌‌ను గూడూరు వరకే పరిమితం చేశారు.