గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : బుధవారం, 10 అక్టోబరు 2018 (15:10 IST)

ఓటే వజ్రాయుధం... ఓటు వేయకపోతే?

ఓటు.. పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితి, గతులను మార్చే శక్తి ఓటుకు ఉన్నది. ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు.
 
రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సమాజం పురోగతి సాధించాలి, మనం బాగుపడాలి అనే తాపత్రయం ఉండడమే కాదు ఓటూ ముఖ్యమే. అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఒకవేళ ఓటు హక్కును వినియోగించుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 
 
వాస్తవానికి ఓటు వేయకపోతే మీరు లెక్కలో లేనట్లే. జన సామాన్యంలో కూడా ఈ అభిప్రాయం బలంగా ఉంది. అన్నీ తెలిసినవాళ్లు, విద్యావంతులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉంది. దీనిని ప్రజాస్వామ్య సంస్కారంగా పేర్కొంటారు. 
 
ప్రజాస్వామ్య వర్థిల్లాలంటే ప్రతి పౌరుడు తన అంతరంగంలో ప్రజాస్వామిక సంస్కారాన్ని అలవరుచుకోవలసి ఉంటుంది. ప్రజాస్వామ్య సంస్కారం బయట ఎక్కడి నుంచో వచ్చింది కాదు. మనలో నుంచే వచ్చింది అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే పౌరులు తమ బాధ్యత గురించి తెలుసుకోవాలి అందుకే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజ్యాంగ నిపుణులు కోరుతున్నారు.