మోదీ, బాబు మధ్య నలిగిపోతున్న వెంకయ్య... అందుకే ఇంత అసహనం
ప్రత్యేక హోదా విషయం ఎత్తితే చాలు... కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులో అసహనం పెరిగిపోతోంది. అది జగన్ అయినా, పవన్ అయినా... ప్రత్యేక హోదా కోరుకునే ఏపీ ప్రజలైనా... ఎవరినీ వదిలిపెట్టకుండా నోటికి వచ్చినట్లు... విసుర్లు విసురుతున్నారు వెంకయ్య. అటు
ప్రత్యేక హోదా విషయం ఎత్తితే చాలు... కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులో అసహనం పెరిగిపోతోంది. అది జగన్ అయినా, పవన్ అయినా... ప్రత్యేక హోదా కోరుకునే ఏపీ ప్రజలైనా... ఎవరినీ వదిలిపెట్టకుండా నోటికి వచ్చినట్లు... విసుర్లు విసురుతున్నారు వెంకయ్య. అటు ప్రధానమంత్రిని మెప్పించి ప్రత్యేక హోదా సాధించలేక, ఇటు ప్యాకేజీతో రాష్ట్ర ప్రజలను మెప్పించలేక మధ్యన వెంకయ్య నలిగిపోతున్నట్లు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని నిలువరించలేక.... అటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హోదాపై గోదాలోకి వస్తే ఏం చేయాలో తోచక వెంకయ్య వేడెక్కిపోతున్నారు.
హోదా విషయంలో వెంకయ్య తాజాగా చేసిన వ్యాఖ్యలు విన్నవారు ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఢిల్లీలో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని తాజాగా వెంకయ్య శెలవిచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. మరి ఆ తర్వాత మాట్లాడిన మాటలపైనే జనాలు ఆశ్చర్యపోతున్నారు.
నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేసినపుడు అప్పటి ప్రతిపక్షాలు ఏమి చేస్తున్నాయని ఘనత వహించిన వెంకయ్య తీవ్రంగా ప్రశ్నించారు. దానితోనే కేంద్రమంత్రి మన:స్థితిపై అందరికీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ను అడ్డుగోలుగా నాటి కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా చీల్చిందన్నది అందరికీ తెలిసిందే. అయితే ఎలా చీల్చ గలిగింది? నాడు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సహకారంతోనే అన్న విషయం కూడా అందరికీ గుర్తుంది.
అడ్డుగోలు విభజనకు రాజ్యసభలో నాడు సంపూర్ణ సహకారం అందించింది వెంకయ్య నాయకత్వంలోని భాజపానే. ఇక, తెలుగుదేశం పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే, రాష్ట్ర విభజనకు మద్దతుగా మూడుసార్లు లేఖలు ఇచ్చింది చంద్రబాబే. పైగా రాష్ట్ర విభజన కోసం జరిగిన ఓటింగ్లో తొలి ఓటు వేసింది కూడా నాటి టిడిపి ఎంపి నామా నాగేశ్వర్ రావే. ఇటు భాజపా, అటు టిడిపిలు కూడబలక్కుని నాటి కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి మద్దతు ఇచ్చిన కారణంగానే యూపిఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డుగోలుగా చీల్చ గలిగింది.
నాడు యూపిఏ ప్రభుత్వం చేస్తోంది తప్పని తెలిసీ మద్దతు ఇచ్చిన టిడిపి, భాజపాలు ఆ తర్వాత పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాయి. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రత్యేక హోదా విషయంలో పై రెండు పార్టీలు చేసిన విన్యాసాలు అందరూ చూస్తూనే ఉన్నారు. రాష్ట్రాన్ని ఏకపక్షంగా అడ్డుగోలుగా చీల్చిందన్న కోపంతోనే 2014 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని బాగానే సత్కరించారు. మరి, వెంకయ్య వచ్చే ఎన్నికల్లో భాజపాకు అదే సత్కారాన్ని కోరుకుంటున్నారేమోనని రాష్ట్రంలోని కమలనాధులే అనుమానిస్తున్నారు.
అడకత్తెరలో పోక చెక్క!
ప్రధాని మోదీకి మొదట్లో కేంద్రమంత్రి వెంకయ్యపై భారీగా భరోసా ఉండేది. సౌత్ అంతా మేనేజ్ చేసే సత్తా వెంకయ్యకు ఉందనే అభిప్రాయాన్ని ఆయనకు కలుగజేసింది వెంకయ్యే. కానీ, ఇపుడు ప్రత్యేక హోదా రాదనే విషయాన్నిజనాల్లోకి తీసుకెళ్ళి, బీజేపీపై ఎటువంటి వ్యతిరేకత రాకుండా అన్ని పార్టీలను మేనేజ్ చేయాల్సిన బాధ్యత కూడా వెంకయ్య భుజాలపైనే మోదీ వేశారు. దీనితో అటు మోదీ, ఇటు ఏపీ రాజకీయం మధ్య వెంకయ్య అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతున్నారు.