శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 నవంబరు 2020 (17:41 IST)

దీపావళి పండుగ రావడానికి కారణాలేంటి.. కథలు ఏంటి?

దీపావళి పండుగ రావడానికి కారణాలున్నాయి. ఎన్నో కథలు ప్రాచుర్యంలో వున్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం, భాగవతాలలో దీపావళి పండుగకు సంబంధించిన కథలు వున్నాయి. రామాయణంలో అయోధ్యకు రాజు అయిన తండ్రి దశరథుని కోరిక మేరకు శ్రీరాముడు, సీతాలక్ష్మణ సమేతుడై పద్నాలుగేళ్ళు అడవిలో నివసించేందుకు వెళతాడు. వనవాసం చేస్తుండగా లంకాధీశుడైన పదితలల రావణాసురుడు సీతను ఎత్తుకు వెళతాడు. ఆ తర్వాత రావణసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. 
 
ఆరోజు అమావాస్య అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నాం. ఇక రెండవ కథగా నరకాసుర సంహారం ప్రాచుర్యంలో వుంది. 
 
ప్రాద్యోషపురానికి రాజు నరకాసురుడు. బ్రహ్మదేవుని నుంచి పొందిన వరగర్వంతో నరకాసురుడు దేవతలను మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురుని ఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. నరకాసురుని పీడ విరగడవ్వడంతో ప్రజలు దీపాలు వెలిగించి పండుగను జరుపుకున్నారు. ఆ పరంపర నేటికీ కొనసాగుతుంది. 
 
మూడవ కథగా పాల సముద్రం నుంచి శ్రీమహాలక్ష్మిదేవి ఉద్భవించిన వృత్తాంతం సంగతికి వెళితే.. మరణాన్ని దరి చేరని అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా దీపావళి రోజున లక్ష్మిదేవి ఉద్భవించింది. సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తారు. 
 
నాలుగవ కథగా భారతంలోని ఈ కథ ప్రాచుర్యంలో వుంది. కౌరవులు సాగించిన మాయా జూదంలో ఓడిన పాండవులు పదమూడేళ్ళు వనవాసం ఒక సంవత్సర కాలం అజ్ఞాత వాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు. 
 
ఐదవ వృత్తాంతంగా రైతుల గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటారు.మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటారు.