గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించే టాబ్లెట్స్ పరగడుపున వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గేందుకు వాడే మాత్రలను పరగడుపున.. అంటే ఖాళీ కడుపుతో వేసుకోవడమే సరైన పద్ధతి. దీనికి కారణం ఏంటంటే... ఈ మందులోని పదార్థం కడుపులో యాసిడ్ ఉత్పత్తిని తగ్గించడానికి పనిచేస్తుంది. ఆహారం తీసుకోకముందే ఇది రక్తంలోకి చేరితేనే ఆహారం తిన్నప్పుడు విడుదలయ్యే యాసిడ్ను ఇది సమర్థవంతంగా అడ్డుకోగలదు.
పరగడుపున ఈ మాత్రలు వేసుకోవడం వల్ల కొత్తగా సైడ్ ఎఫెక్ట్స్ రావు. అయితే సాధారణంగా ఈ మందు వల్ల కొందరిలో తలనొప్పి, కడుపు నొప్పి, విరేచనాలు లేదా నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి మందు స్వభావం వల్ల కలిగేవే తప్ప, పరగడుపున వేసుకోవడం వల్ల కలిగేవి కావు.
కొంతమంది ఉదయాన్నే వేసుకోవడం మర్చిపోతుంటారు. అలాంటివారు మధ్యాహ్నం అన్నం తినకముందు వేసుకోవచ్చు. కానీ కొన్ని నియమాలు పాటించాలి. మధ్యాహ్నం భోజనానికి కనీసం 30 నుండి 60 నిమిషాల ముందు వేసుకోవాలి. వేసుకున్న వెంటనే భోజనం చేయకూడదు. మందు పనిచేయడానికి కొంత సమయం ఇవ్వాలి. సాధారణంగా ఈ మందును రోజుకు ఒకసారి ఉదయం పూట వేసుకోమని డాక్టర్లు సూచిస్తారు. ఎందుకంటే ఉదయం వేసుకుంటే రోజంతా ఎసిడిటీ నియంత్రణలో ఉంటుంది.
మాత్రను మింగేటప్పుడు తగినంత నీరు తాగాలి. మాత్రను నమలడం లేదా పొడి చేయడం చేయకూడదు. ఈ మాత్రలను డాక్టర్ సలహా లేకుండా వారాల తరబడి వాడకూడదు. ఎక్కువ కాలం వాడితే విటమిన్ బి12 లోపం లేదా ఎముకల బలహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.