శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Modified: శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (14:16 IST)

సమస్తరోగాలకు దివ్యౌషధం నవ్వు....

ప్రపంచంలో నవ్వగలిగే ఏకైక జీవి మనిషి. సృష్టిలో కోటానుకోట్ల జీవరాశులు ఉన్నప్పటికీ కేవలం మనిషికి మాత్రమే నవ్వగలిగే శక్తిని ప్రసాదించింది ప్రకృతి. నవ్వు మనిషికి ఎంతో మంచి చేస్తుంది. నవ్వినప్పుడు ముఖ కండరాలన్నీ కదులుతాయి. అంతేకాదు... ఛాతీ ఉదర, కండరాలకు వ్యాయామం చేకూరుతుంది. 
 
ఇంతటి విలువైన నవ్వుకు మనిషి ఎందుకో దూరమవుతున్నాడు. రోజుకు కనీసం 18 నిమిషాలపాటు మనిషి నవ్వేవాడు. అయితే ఇది ప్రస్తుత పరిస్థితి కాదు. 1950ల కు ముందుమాట. మరి నేటి పరిస్థితి ఏమిటీ... అంటే.... కేవలం ఆరంటే ఆరు నిమిషాలకు మించి మనిషి నవ్వటం లేదని పలు పరిశోధనలు చెపుతున్నాయి. 
 
పెద్దల్లో ఈ పరిస్థితి ఇలా ఉంటే ఈ ప్రభావం పిల్లలపైనా పడుతోందని వారు చెపుతున్నారు. ఇదివరకు పిల్లలు రోజులో కనీసం నాలుగు వందల సార్లు నవ్వేవారు. ఇప్పుడా అందాల నవ్వులు రోజుకు కేవలం 60 నుండి 70కి పడిపోయాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
 
గత ఆరు దశాబ్దాలుగా తగ్గుతూ వస్తున్న ఈ నవ్వుకు మనిషి అనారోగ్యానికి సంబంధం ఉన్నది. నేడు ప్రజలలో అత్యధికంగా కనిపిస్తున్న అనారోగ్య సమస్యలకు నవ్వకపోవటమే కారణమవుతోంది. 
 
ఆదుర్దా, గుండె జబ్బులు, నిద్రలేమి తదితర ఎన్నో రకాల ఇబ్బందులు కేవలం మనసారా నవ్వకపోవటం కలుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. నేడు మానవాళిని పట్టిపీడిస్తున్న సమస్తరోగాలకు దివ్యౌషధం ఒక్క నవ్వేనంటున్నారు.