బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2020 (16:25 IST)

ఆ బ్లడ్ గ్రూపుల వారిని పగబట్టిన కరోనా వైరస్!!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ఇపుడు ప్రతి ఒక్కరూ భయపడిపోతున్నారు. ఈ వైరస్ బారినపడుకుండా ఉండేందుకు అనేక రకాలైన జాగ్రత్తలు తీసుకుంటూ, వ్యక్తిగత పరిశుభ్రతను కూడా అమితంగా పాటిస్తున్నారు. అలాగా, సామాజిక భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు. 
 
అయినప్పటికీ.. ఈ వైరస్ ఎక్కువగా ఏ, బీ, ఏబీ రక్త గ్రూపుల వారికే సోకుతున్నట్టు తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ సర్వేను బ్రిటిష్‌ కొలంబియా యూనివర్శిటీ, డెన్మార్క్‌లోని ఓడెన్స్‌ యూనివర్శిటీ హాస్పిటల్‌ పరిశోధకలు వేర్వేరుగా నిర్వహించారు. 
 
ఈ రెండు అధ్యయనాల్లోనూ ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. బ్లడ్‌ గ్రూప్‌ ‘ఓ (పాజిటివ్‌ లేదా నెగటివ్‌)’ కలిగిన ప్రజలపై కరోనా వైరస్‌ అంతగా ప్రభావం చూపించడం లేదని, వారిలో వైరస్‌ కారణంగా శరీర అవయవాలు చెడిపోవడం, మత్యువాత పడడం చాలా తక్కువని ఓడెన్స్‌ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. పైగా, ఒ రక్తం గ్రూపు వారు ఈ వైరస్ బారిన తక్కువగా పడుతున్నట్టు తేలింది. 
 
అయితే, ఏ, బీ, ఏబీ బ్లడ్‌ గ్రూప్‌ల వారే ఎక్కువగా కరోనా వైరస్‌ బారిన పడుతుండగా, వారిపైనే వైరస్‌ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని, వారి పట్లనే వైరస్‌ ప్రాణాంతకంగా మారుతుందని డానిష్‌ పరిశోధకులు తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల మంది కరోనా బాధితుల నుంచి 4,73,000 మంది కరోనా కేసులపై వారీ అధ్యయనం జరిపారు. 
 
ఓ, బీ బడ్‌ గ్రూపుల వారికన్నా ఏ, ఏబీ బడ్‌ గ్రూప్‌ల వారే ఎక్కువగా కరోనా వైరస్‌ బారిన పడుతున్నారని, ఏ, ఏబీ గ్రూప్‌లపైనే వైరస్‌ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని బ్రిటిష్‌ కొలంబియా యూనివర్శిటీ జరిపిన మరో అధ్యయనంలో బయట పడింది. ఓడెన్స్‌ అధ్యయనంలో కరోనా కేసుల్లో 38 శాతం మంది ఓ బ్లడ్‌ గ్రూప్‌ వారుకాగా, 62 శాతం మంది ఏ, బీ లేదా ఏబీ బ్లడ్‌ గ్రూప్‌లవారు ఉన్నారు. 
 
అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో 45 శాతం మంది ఏ, ఏబీ బ్లడ్‌ గ్రూప్‌లకు చెందిన వారే ఉండడం వల్ల వారంతా కరోనా వైరస్‌ బారిన పడే అవకాశం ఉందని అధ్యయనం తేల్చింది. రెండు అధ్యయనాల్లో ఒక్క ‘బీ’ బ్లడ్‌ గ్రూప్‌ విషయంలోనే పరిశోధకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా, మిగతా విషయాల్లో ఏకాభిప్రాయాన్నే వ్యక్తం చేశారు.