తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు ప్రభుత్వం తరపున బుధవారం రాత్రి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సంప్రదాయం ప్రకారం తిరుమలలో బేడీ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్న ఆయన తలపై పట్టువస్త్రాలను పెట్టుకుని తిరుమల ప్రధాన ఆలయం వరకూ నడిచి వెళ్ళారు.
అక్కడ ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు అధికారులు ప్రభుత్వం తరపున వచ్చిన పట్టువస్త్రాలను తీసుకున్నారు. అనంతం చంద్రబాబు నాయుడు స్వామి దర్శనం చేసుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు సిఎం దంపతులకు వేద ఆశీర్వచనం ఇచ్చారు.
టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావులు ఆయనకు తీర్థప్రసాదాలను అందజేశారు. బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన నేటి సాయంత్రం ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆయన వాహనసేవలో పాల్గొనడానికి బయలుదేరారు.
