శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. స్వాతంత్ర్య దినోత్సవం
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఆగస్టు 2020 (09:34 IST)

కరోనా వ్యాక్సిన్‌పై మోదీ కీలక ప్రకటన.. ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు పథకం

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో.. కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతిని ఉద్దేశించి మాట్లాడిన మోడీ… నేడు మూడు టీకాలు భారతదేశంలో పరీక్ష దశలో ఉన్నాయని అన్నారు. శాస్త్రవేత్తలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే, దేశం వాటిని పెద్ద ఎత్తున ఉత్పత్తిని ప్రారంభిస్తామని మోదీ అన్నారు. పది రోజుల క్రితం అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ప్రధాని అన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని జాతి మొత్తం ఆహ్వానించిందని మోదీ అన్నారు.
 
భారత్ ప్రపంచంలో ఎవరికన్నా తక్కువ కాదని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ఉత్తమ ఉత్పత్తుల దేశంగా భారత్ ఉందని మోదీ పేర్కొన్నారు. మన ఉత్పత్తులకు తగిన మార్కెట్‌ని మనమే సృష్టించుకోవాలి అని మోదీ కోరారు. పేర్కొన్నారు. పశ్చిమ ఆసియా దేశాల్లో భారత్ చాలా కీలక దేశమన్నారు. 
 
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి తన ప్రసంగంలో ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు పథకాన్ని ప్రకటించారు. 
 
ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు పథకంలో భాగంగా వ్యక్తికి జరిగిన చికిత్సలు, పరీక్షలు సహా వైద్య చరిత్ర అంతటినీ డిజిటలీకరించి ఈ కార్డులో భద్రపరుస్తారు. దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్‌ రూపంలో భద్రపరిచేందుకు ఈ పధకాన్ని చేపడుతున్నారు. ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలా లేదా అనే నిర్ణయాన్ని పూర్తిగా ఆస్పత్రులు, పౌరులకే నిర్ణయాధికారమని మోదీ తెలిపారు. 
 
ఆస్పత్రులు, క్లినిక్‌లు, వైద్యులను కేంద్ర సర్వర్‌తో అనుసంధానిస్తారు. దశలవారీగా అమలు చేసే ఈ పథకానికి రూ.300 కోట్ల బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టారు. ఈ పథకం ప్రయోజనాల్లో కీలకమైనది ఏంటంటే దేశంలో ఏ వైద్యుడు, ఆస్పత్రిని సందర్శించే వ్యక్తి తన వెంట వైద్య పరీక్షల రిపోర్టులు, ప్రిస్క్రిప్షన్లు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదని మోదీ ప్రకటించారు. యూనిక్‌ ఐడీ ద్వారా రోగికి సంబంధించిన పూర్తి వివరాలు, రికార్డులను వైద్యులు పరిశీలిస్తారని ప్రధాని తెలిపారు.