శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జులై 2020 (13:52 IST)

కరోనాతో గిరిజన నేత మృతి.. మృతదేహం కోసం ఆరుగురి కిడ్నాప్?

కరోనా వైరస్ సోకి మరణించిన వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించరు. ప్రభుత్వమే మృతదేహాలను ఖననం చేస్తుంది. కానీ, ఆ గిరిజనుల దెబ్బకు ఓ దేశ ప్రభుత్వమే దిగివచ్చింది. కరోనా సోకి చనిపోయిన గిరిజన తెగ నాయకుడి మృతదేహాన్ని మట్టిలోనుంచి వెలికి తీసి గిరిజనులకు అప్పగించింది. ఈ ఘటన ఈక్వెడారర్ దేశంలోని అమెజాన్ అడవుల్లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెజాన్ అడవుల్లో నివశించే ఓ గిరిజన తెగ నాయకుడు ఇటీవల కరోనా వైరస్ సోకి మరణించాడు. ప్రోటోకాల్ ప్రకారం ఆ నాయకుడి మృతదేహాన్ని ప్రభుత్వ అధికారులు ఖననం చేశారు. 
 
కానీ, తమ నాయకుడి మృతదేహాన్ని తమకు అప్పగించాలని అడవుల్లో నివశించే గిరిజనులు డిమాండ్ చేస్తూ, ఇద్దరు పోలీసులు, ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులను కిడ్నాప్ చేశారు. 
 
దాదాపు 600 మంది గిరిజనులు, ఆరుగురిని కిడ్నాప్ చేసి, తమ నాయకుడి మృతదేహాన్ని అప్పగిస్తేనే వారిని విడుదల చేస్తామని పంతం పట్టారు. ఈ ఘటన పాస్తాజా ప్రావిన్స్‌లోని అమెజాన్ అడవుల్లో జరిగింది. 
 
నిరసనకారులతో చర్చలు జరిపిన అనంతరం, పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి, వారికి అప్పగించామని, ఆ తర్వాత బందీలను వారు విడిచి పెట్టారని రోమో వెల్లడించారు. 
 
కాగా, లాటిన్ అమెరికా దేశాల్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న దేశాల్లో ఈక్వెడార్ కూడా ఒకటి. ఇక్కడ ఇప్పటికే 61 వేలకు పైగా కేసులు నమోదుకాగా, 4,800 మంది వరకూ మరణించారు.