గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (21:06 IST)

ఆక్సిజన్ కొరత: జర్మనీ నుంచి 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు

Army
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. వైరస్ ప్రభావంతో ఎక్కువ మంది కరోనా రోగులు ఆక్సిజన్‌పై ఆధారపడుతున్నారు. ఆక్సిజన్ కొరత ఏర్పడిన కారణంగా కరోనా వ్యాధిగ్రస్థులు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జర్మనీ నుంచి 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను దిగుమతి చేసుకోవాలని రక్షణ శాఖ నిర్ణయించింది. 
 
దీని కోసం ఎమర్జెన్సీ నిధుల వినియోగానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నాలుగు రోజుల కిందట అనుమతి ఇచ్చారు. దీంతో ఎక్కడికైనా తరలించే మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను భారత్‌కు తీసుకువచ్చేందుకు సైనిక రవాణా విమానాలను సిద్ధం చేస్తున్నారు.
 
సంబంధిత ప్రక్రియలు పూర్తయితే వారం రోజుల్లో ఇవి దేశానికి చేరుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు తెలిపారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఏఎఫ్ఎంసీ ఆసుపత్రుల్లో ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ఉంచుతారని చెప్పారు. 
 
ప్రతి ప్లాంట్ నిమిషానికి 40 లీటర్లు, గంటకు 2,400 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుందని వివరించారు. అవసరం మేరకు వీటిని ఎక్కడికైనా తరలించవచ్చని పేర్కొన్నారు. మరిన్ని ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నదని వెల్లడించారు.