ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

వైకాపా అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది : నారా లోకేశ్

వైసీపీ నేత‌ల‌పై టీడీపీ నేత నారా లోకేశ్ మండిప‌డ్డారు. య‌‌ల‌మంచిలి వైసీపీ ఎమ్మెల్యే క‌న్న‌బాబు బెదిరిస్తున్నారంటూ అప్పారావు అనే వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేశార‌ని వ‌చ్చిన వార్త‌ను ఆయ‌న పోస్ట్ చేశారు.
 
'దౌర్జ‌న్యాల‌కు ప్యాంటు, అక్ర‌మాల‌కు షర్టు వేసిన‌ట్టుండే య‌‌ల‌మంచిలి వైసీపీ ఎమ్మెల్యే క‌న్న‌బాబు అరాచ‌కాల‌కు హ‌ద్దే లేకుండా పోయింది. నియోజ‌క‌వ‌ర్గంలో క‌న్నబాబు చేసిందే చ‌ట్టం, చెప్పిందే వేదం, క‌న్నుప‌డితే క‌బ్జా ఖాయం' అని విమ‌ర్శించారు.
 
'రాంబిల్లికి చెందిన ద‌ళితుడు భూపతి అప్పారావు (పండు) త‌న‌కు ఎమ్మెల్యే అనుచ‌రుల నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని 22-03-2021న పోలీసుల‌కు ఫిర్యాదు ఇవ్వ‌డ‌మే చేసిన పాపంగా చంపేయ‌డానికి య‌త్నించారు రౌడీ ఎమ్మెల్యే అనుచ‌రులు' అని మండిప‌డ్డారు
 
'ద‌ళితుల‌పై ద‌మ‌న‌కాండ సాగించేందుకు త‌న ఎమ్మెల్యేల‌కు వైఎస్ జ‌గ‌న్  ఏమైనా లైసెన్స్ ఇచ్చారా? ఇలా చెలరేగిపోతున్నారు' అని నారా లోకేశ్ ప్రశ్నించారు.
 
అంతేకాకుండా, వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని ఆరోపించారు. అక్రమ తవ్వకాలతో ఖనిజ సంపదను లూటీ చేస్తున్న వైనం తాజాగా మరొకటి బయటపడిందని చెప్పారు 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలని చెబుతూ ప్రజల కళ్ళుగప్పి మాయ చేస్తోంటే... ఇదే అదనుగా వైసీపీ నేతలు ఇసుక, మట్టి మొదలుకుని ఎర్రచందనం వరకు కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్టు దోచుకుంటున్నారని లోకేశ్ మండిపడ్డారు. 
 
ఇప్పుడు కొత్తగా అలెగ్జాండరైట్ రంగురాళ్ల అక్రమ తవ్వకం బయటపడిందన్న ఆయన.. విశాఖ జిల్లాలోని గొలుగొండ మండలంలో నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు జరుపుతున్న తవ్వకాలను గురించి తెలిపారు. 
 
సాలికమల్లవరం రిజర్వ్ ఫారెస్టులో జేసీబీలతో యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారన్నారు. అటవీ సిబ్బందిని కూడా బెదిరిస్తున్నారంటే ఎంత బరి తెగింపో చూడండని వాటికి సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు. వైసీపీ నేతలు తమ స్వార్థం కోసం చిన్నారులతో అడవుల్లో ప్రమాదకరమైన సొరంగాలు తవ్విస్తున్నారని.. ఇది వారి క్రూరత్వానికి నిదర్శనమన్నారు. 
 
ఆ పిల్లలకు ఏమైనా జరిగితే బాధ్యులెవరని ప్రశ్నించారు. ‘‘ఒకవైపు అక్రమ తవ్వకం, మరోవైపు మైనర్ల ప్రాణాలతో చెలగాటం.. ఈ నేరాలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు? పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు’’ అని లోకేశ్ నిలదీశారు.