మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

తారా స్థాయికి ఆహార సంక్షోభం... తిండికోసం అల్లాడుతున్న పాక్ ప్రజలు

పాకిస్థాన్ దేశంలో ఆహార సంక్షోభం తారా స్థాయికి చేరుకుంది. దీంతో ఆ దేశ ప్రజలకు పూట గడవడం గగనంగా మారింది. ఫలితంగా పాక్ ప్రజలు తిండి కోసం అల్లాడిపోతున్నారు. గోధుమ పిండి లోడుతో వెళుతున్న ట్రక్‌ను వందలాది మంది ప్రజుల ఛేజ్ చేసే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణాలకు తెగించి ఆ ట్రక్కు వెనుకభాగంలో ఎక్కడం వీడియోలో కనిపిస్తుంది. ఇది ఆ దేశంలో నెలకొన్న ఆహార సంక్షోభానికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియోను ప్రొఫెసర్ సజ్జద్ రాజా షేర్ చేశారు. 
 
ఇది బైక్ ర్యాలీ కాదు. గోధుమ పిండి కోసం పాక్ ప్రజలు పడుతున్న కష్టాలకు ఇది నిదర్శనమన్నారు. జమ్మూకాశ్మీర్ ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని అన్నారు. తాను పాకిస్థానీ కానందుకు సంతోషిస్తున్నట్టు చెప్పారు. పాకిస్థాన్‌‍తో భవిష్యత్ ఉందని ఇప్పటికీ భావిస్తున్నారా? అని ఆయన ఆ ట్వీట్‌లో జమ్మూకాశ్మీర్ ప్రజలను ప్రశ్నించారు. 
 
కాగా, పాకిస్థాన్‌లో ఆహార సంక్షోభం రోజురోజుకు ముదురుతుండడంతో భద్రతా దళాల పర్యవేక్షణలో గోధుమ పిండిని పంపిణీ చేస్తున్న దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభుత్వం రాయితీపై అందించే గోధుమ పిండి కోసం ఖైబర్ ఫక్తుంఖ్వా, సింధ్, బలూచిస్థాన్ వంటి ప్రాంతాల్లో ప్రజలు గంటల తరబడి క్యూల్లో నిల్చుంటున్నారు. 
 
ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పాకిస్థాన్‌లో అత్యధిక శాతం మంది ప్రజలు గోధుమపిండినే ఆహారంగా ఉపయోగిస్తారు. కాగా, పాకిస్థాన్‌లో ఆహార ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగడంతో అది ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. మరోవైపు, పాక్‌లో విదేశీ మారక నిల్వలు కూడా అడుగంటాయి.