గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2023 (14:43 IST)

ప్రభుత్వ కార్యాలయాల్లో యాపిల్ ఫోన్లపై నిషేధం... ఏ దేశంలో?

Apple
పెరుగుతున్న సాంకేతికతో పాటు దానివల్ల ఏర్పడే ముప్పు సైతం అధికంగా పెరుగుతుంది. అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వినియోగం వల్ల దేశ భద్రతకు కూడా ముప్పు ఏర్పడుతుంది. దీంతో పలు దేశాలు కొన్ని ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నాయి. అలాంటి వాటిలో యాపిల్ ఫోన్లు కూడా ఉన్నాయి. యాపిల్ ఫోన్లతో ముప్పు పొంచివుందని గ్రహించిన డ్రాగన్ కంట్రి ఆ ఫోన్లను ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించకుండా నిషేధం విధించింది. ఈ మేరకు వాటిని కార్యాలయాలకూ తీసుకురావొద్దని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది.
 
చైనా ప్రభుత్వానికి చెందిన ఉన్నతోద్యోగులు ఈ మేరకు కింది స్థాయి ఉద్యోగులకు కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసినట్లు వాల్‌స్ట్రీట్‌ పేర్కొంది. యాపిల్ సహా ఇతర దేశాలకు చెందిన ఏ ఫోన్లనూ కార్యాలయాలకు తీసుకురాకూడదని సూచించినట్లు సమాచారం. యాపిల్‌తో పాటు ఏయే ఫోన్లను తీసుకురాకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నదీ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ స్పష్టంగా పేర్కొనలేదు. 
 
దీనిపై చైనా ప్రభుత్వ వర్గాలు అధికారికంగా స్పందించలేదు. యాపిల్‌కు అతిపెద్ద మార్కెట్లలో చైనా ఒకటి. దాదాపు ఐదో వంతు ఆదాయం చైనా నుంచే వస్తోంది. త్వరలో యాపిల్‌ తన ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లను లాంచ్‌ చేయనున్న వేళ ఈ నిర్ణయం బయటకు రావడం గమనార్హం. ఇది ఇరు దేశాల మధ్య మరోసారి ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
 
చైనా కొన్నేళ్లుగా డేటా సెక్యూరిటీ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కొత్త చట్టాలను తీసుకొచ్చింది. కంపెనీలకు కొన్ని నియమాలను నిర్దేశిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మే నెలలో పెద్ద ప్రభుత్వరంగ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాంకేతికంగా ఆత్మనిర్భరతపై దృష్టి సారించాలని పేర్కొంది. వాణిజ్యం విషయంలో అమెరికా- చైనా మధ్య ఏళ్లుగా ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 
 
గతంలో చైనాకు చెందిన హువావే కంపెనీని అమెరికా బ్యాన్‌ చేసింది. టిక్‌టాక్‌పైనా నిషేధం విధించింది. ఇప్పుడు చైనా సైతం అదే చేస్తోంది. తాజా నిర్ణయం ఈ కోవలోకే వస్తుంది. ఇటీవల అమెరికా కామర్స్‌ సెక్రటరీ చైనాలో పర్యటించినప్పుడు చైనా పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. డ్రాగన్ దేశంలో వ్యాపారం చేస్తున్న అమెరికా కంపెనీలపై జరిమానాలు, దాడులు జరుగుతున్నాయని తమకు ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.