శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (14:58 IST)

సరిహద్దుల్లో యుద్ధమేఘాలు: సర్వసన్నద్ధంగా భారత సైన్యం

ఇండో - పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మంళవారం వేకువజామున భారత వైమానికదళం నిర్వహించిన మెరుపుదాడులతో ఈ పరిస్థితి ఏర్పడింది. అదేసమయంలో భారత్ తన త్రివిధ దళాలను అప్రమత్తం చేసింది. ఫలితంగా ఎపుడు ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతోంది. 
 
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌‌పై గుర్రుగా ఉన్న భారత్... మంగళవారం యుద్ధ విమానాలతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడింది. ఎక్కడ ఉగ్ర శిబిరాలు కనిపించినా కనికరం లేకుండా అక్కడ విధ్వంసం సృష్టించింది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో బయలుదేరిన వైమానిక దళ సిబ్బంది మెరుపు దాడులు నిర్వహించారు. మొత్తం పన్నెండు మిరాజ్ జెట్ ఫైటర్స్‌తో దాడులు జరిగాయి. ఈ దాడులతో పాకిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
 
ఈ విషయాలను భారత వైమానిక దళ అధికారులు నిర్ధారించారు. వైమానిక దళం దాడులు ప్రారంభించిన విషయం వాస్తవమేనని ఇప్పటికే అనేక ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసామని తెలిపారు. నియంత్రణ రేఖను దాటి వెళ్లిన వైమానిక దళం బాలాకోట్, చకోటి, ముజఫరాబాద్ చుట్టుపక్కల ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయగా ఆ బాంబు దాడుల శబ్దాలు దాదాపు 30 కిలోమీటర్ల పరిధి వరకు వినిపించాయి.
 
ఈ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ ఏ క్షణంలో అయినా భారత్‌పై సరిహద్దుల్లో దాడులకు దిగే అవకాశం ఉన్నందున నియంత్రణ రేఖ వెంబడి సైన్యాన్ని అప్రమత్తం చేసారు. ఆర్మీకితోడుగా భారత వాయుసేన కూడా సర్వ సన్నద్ధంగా ఉండటంతో పాకిస్థాన్ దాడులు చేస్తే సమర్థవంతంగా తిప్పికొడతామని అధికారులు తెలియజేసారు. మరోవైపు భారత్‌లోని ప్రముఖ ఎయిర్‌పోర్ట్‌లు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో నిఘాను పటిష్టం చేసారు.