శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (14:08 IST)

పాక్ ఆర్మీ మేల్కొనేలోపే... పని పూర్తి చేసిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్...

పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి తర్వాత భారత జాతి రగిలిపోతోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం భారత వైమానిక దళం పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ ఆర్మీ
తేరుకునేలోపే భారత వైమానిక దళాలు కేవలం 21 నిమిషాల్లో దాడులు పూర్తి చేసుకుని వెంటనే వెనుతిరిగాయి. 
 
ఏం జరిగిందో అర్థమయ్యేలోపే జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్‌ 2000 జెట్‌ ఫైటర్లు... ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దాదాపు వెయ్యి కిలోల బాంబులను వైమానికదళం ఉగ్రవాద శిబిరాలపై ప్రయోగించగా, జైషే మహ్మద్‌కు చెందిన అల్పా-3 కంట్రోల్‌ రూం పూర్తిగా ధ్వంసమైనట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, ఈ మెరుపుదాడుల్లో మిరాజ్ 2000 యుద్ధ విమానం కీలకపాత్ర పోషించింది. మొత్తం 12 మిరాజ్‌ 2000 యుద్ధ విమానాలు ఈ దాడిలో పాల్గొన్నాయి. అధునాతన మల్టీరోల్‌ ఫైటర్‌ అయిన ఈ యుద్ధ విమానం గంటకు 2,336 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉంది. న్యూక్లియర్‌ దాడుల కోసం ఈ యుద్ధ విమానాన్ని ప్రత్యేకంగా తయారుచేశారు. 1550 కిలోమీటర్ల లక్ష్యాన్ని మిరాజ్‌ అవలీలగా ఛేదించగలదు. సెకన్‌కు 280 మైల్స్‌ ఎగిరే సామర్థ్యం ఉండగా, 2X30 కెనాన్లతో 125 రౌండ్లు దాడి చేయగలదు.
 
మంగళవారం వేకువజామున 3.30 గంటలకు బయలుదేరిన ఈ యుద్ధ విమానాలు తొలిదాడి బాలాకోట్‌లో 3.45 గంటలకు, రెండో దాడి ముజఫరాబాద్‌లో 3.48 గంటలకు, మూడో దాడి చకౌటిలో 3.58 గంటలకు చేసి కేవలం 21 నిమిషాల వ్యవధిలో తిరిగి భారత భూభాగంలోకి ప్రవేశించాయి. పైగా, భారత వైమానికి దళానికి చెందిన యుద్ధ విమానాలు తిరిగి దాడుల్లో పాల్గొనడం 1971 సంవత్సరం తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ముఖ్యంగా, నియంత్రణరేఖను దాటి పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిమరీ దాడులు చేశాయి. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా భారత వాయుసేన పాల్గొంది. ఆ సమయంలో తీవ్రవాదుల ఔట్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. అయితే, నియంత్రణ రేఖను దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, భారత గగనతలంలో ఉంటూనే ఈ దాడులు జరిపింది.
 
ఈ దఫా మాత్రం పాక్ భూభాగంలోకి ప్రవేశించిన వైమానిక విమానాలు నిర్ధేశిత లక్ష్యాలపై దాడులు చేశాయి. మరోవైపు, భారత్ తన డిఫెన్స్ మెకానిజంను మోహరింపజేసింది. అలాగే, జాంనగర్, మలియా, అహ్మదాబాద్, వడోదరాల్లో ఉన్న ఎయిర్ బేసుల్లో హైఅర్ట్ ప్రకటించింది. ఏ క్షణంలోనైనా విరుచుకుపడేలా త్రివిధ బలగాలను సన్నద్ధం చేసింది.