గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (12:33 IST)

ఎందుకు దాడి చేశామంటే... సర్జికల్ స్ట్రైక్-2పై క్లారిఫికేషన్...

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానాలు మెరుపుదాడులు చేయడానికి గల కారణాలను భారత విదేశాంగ శాఖ వివరించింది. ఇదే అంశంపై విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మంగళవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సర్జికల్ స్ట్రైక్-2కు గల కారణాలను వివరించారు. 
 
పుల్వామా భారత సీఆర్పీఎఫ్ జవాన్లపై జైషే మహమ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడిన తర్వాత, పాకిస్థాన్ చర్యలు తీసుకుంటుందని ఆశించామని, కానీ, ఆ దేశం వైపు నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడంతోనే లక్షిత దాడులు చేయాల్సి వచ్చిందని వివరించారు. 
 
పైపెచ్చు.. భారత్‌లో మరిన్ని ఆత్మాహుతి దాడులకు జైషే ఉగ్ర సంస్థ ప్లాన్ చేస్తున్నారన్న పక్క సమాచారంతోనే మెరుపు దాడులు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అలాంటి దారుణాలకు పాల్పడకముందే వారిని మట్టుబెట్టాలన్న నిర్ణయానికి వచ్చామని ఆయన వివరించారు. 
 
మిరాజ్ యుద్ధ విమానాలతో జరిపిన ఈ దాడులు బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ శిబిరంపై జరిగినట్టు తెలిపారు. ఈ దాడుల్లో అత్యధిక సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారని, ఆ సంఖ్యపై తాను ప్రస్తుతానికి ఏమీ చెప్పలేనని చెప్పారు. ఈ దాడుల వల్ల సామాన్య ప్రజానీకానికి ఎలాటి ప్రాణహాని కలగలేదన్నారు. కేవలం ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకునే దాడులు చేసినట్టు తెలిపారు. 
 
పాకిస్థాన్ ప్రభుత్వం మద్దతు లేనిదే ఉగ్రవాద దాడులు జరగబోవని ప్రపంచం మొత్తానికీ తెలుసునని, ఐఎస్ఐ అండ చూసుకుని రెచ్చిపోయే ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పే తీరుతామని, అందులో భాగంగానే యుద్ధ విమానాలతో దాడులకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఇంకా వందల కొద్దీ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని, ఒక్కో చోట పదుల సంఖ్యలో ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారన్న సమాచారం తమ వద్ద ఉందని గోఖలే వెల్లడించారు.