కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్
దశాబ్దాల కాలంగా భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య కొనసాగుతున్న కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య సంచలన రీతిలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ప్రకటించిన 16 గంటల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఇరు దేశాలతో కలిసి పనిచేస్తానని ప్రకటించడం గమనార్హం.
'సమస్యాత్మకమైన' కాశ్మీర్ వివాదానికి పరిష్కారం కనుగొనేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అయితే, కాశ్మీర్ తమ అంతర్భాగమని, ఈ విషయంలో మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని తాము అంగీకరించబోమని న్యూఢిల్లీ మొదటి నుంచి స్పష్టం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్ తాజా ప్రతిపాదనపై భారత ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.
'భారత్, పాకిస్థాన్ బలమైన, అచంచలమైన నాయకత్వ పటిమకు నేను గర్విస్తున్నాను. ఎంతో మంది మరణానికి, విధ్వంసానికి దారితీసే ప్రస్తుత దూకుడును ఆపాల్సిన సమయం ఆసన్నమైందని వారు గ్రహించినందుకు వారి బలం, వివేకం, దృఢత్వానికి నా అభినందనలు. లక్షలాది మంది అమాయక ప్రజలు చనిపోయి ఉండేవారు! మీ ధైర్యమైన చర్యలతో మీ వారసత్వం ఎంతగానో పెరిగింది' అని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో పోస్ట్ చేశారు.
"ఈ చారిత్రక, వీరోచిత నిర్ణయానికి అమెరికా సహాయపడటం గర్వకారణం. చర్చల్లో లేనప్పటికీ, ఈ రెండు గొప్ప దేశాలతో వాణిజ్యాన్ని గణనీయంగా పెంచుతాను. అదనంగా, 'వేయి సంవత్సరాల' తర్వాత కాశ్మీర్ సమస్యకు సంబంధించి ఒక పరిష్కారం లభిస్తుందేమో చూడటానికి మీ ఇద్దరితో కలిసి పనిచేస్తాను" అని పేర్కొన్నారు.
శనివారం మధ్యాహ్నం భారత్, పాకిస్థాన్ను తక్షణమే పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య కొన్ని గంటల క్రితమే తీవ్రస్థాయిలో కాల్పులు జరిగిన నేపథ్యంలో ఈ ప్రకటన ఆశ్చర్యం కలిగించింది. అమెరికా మధ్యవర్తిత్వంతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇరు దేశాలు ఇంగితజ్ఞానం, గొప్ప తెలివితేటలు ప్రదర్శించాయని ట్రంప్ అభినందించారు.