1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 4 మే 2019 (10:33 IST)

అమ్మాయిల మనసు చదివి రూ.7.2 కోట్లు దోచుకున్నాడు...

లండన్‌లో భారత సంతతికి చెందిన వ్యాస్ అనే వ్యక్తికి ఆరేళ్ళ జైలుశిక్ష పడింది. అమ్మాయిల మనసు చదవడంలో ఆరితేరిన ఈ కేటుగాడు.. ఆరుగురు అమ్మాయిల నుంచి రూ.7.2 కోట్ల మేరకు దోచుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లండన్‌లో నివసించే కేయూర్ వ్యాస్ అనే భారత సంతతి యువకుడు రొమాంటిక్ మోసగాడు అనే ముద్ర వేయించుకున్నాడు. 
 
తప్పుడు ప్రొఫైల్స్‌తో ఆన్‌లైన్‌లో అమ్మాయిలతో పరిచయం పెంచుకోవడం, తన వలలో పడ్డారని నిశ్చయించుకున్నాక వారి నుంచి డబ్బులు గుంజడం వ్యాస్ ప్రధాన వ్యాపకం. వారి నుంచి డబ్బులు రాబట్టేందుకులేని కంపెనీలు ఉన్నట్టుగా భ్రమింపజేసేవాడు. వాటిలో పెట్టుబడి పెడితే పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని ఊరించేవాడు. అతడి మాటలు నిజమేనని నమ్మినవారిలో కొందరు ఉన్నదంతా ఊడ్చి అతడి చేతిలో పెట్టారు. ఇలా ఏకంగా రూ.7.2 కోట్ల దండుకుని మోసపోయారు. 
 
ఆ తర్వాత తాము మోసపోయామని గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేస్తే తనకిచ్చిన సొమ్ము అంతా నష్టపోతారని బెదిరించేవాడు. దాంతో కొందరు డబ్బు కోసం మిన్నకుండిపోయేవారు. అయితే ఎంతకీ డబ్బు ఇవ్వకపోవడంతో వ్యాస్ తీరుపై అనుమానంతో కొందరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి బండారం బట్టబయలైంది. వ్యాస్ కేసును నాలుగేళ్లుగా విచారణ జరిపిన కింగ్ స్టన్ క్రౌన్ కోర్టు అతడికి ఆరేళ్ల జైలుశిక్ష విధించింది.