1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2023 (15:07 IST)

‌ఇమ్రాన్ ఖాన్‌‍కు భారీ ఊరట.. తోషాఖానా కేసులో మూడేళ్ల శిక్ష నిలిపివేత

imran khan
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, ఆ దేశ క్రికెట్ దిగ్గజం, పీటీఐ పార్టీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. తోషాఖానా కేసులో ఆయనకు ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల శిక్షను ఇస్లామాబాద్ కోర్టు నిలిపివేసింది. 
 
తోషాఖానా అవినీతి కేసులో తనకు కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ ఇమ్రాన్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన హైకోర్టు సోమవారం విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. ఈ తీర్పును  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమిర్‌ ఫారూఖ్‌, జస్టిస్‌ తారీఖ్‌ మహ్మద్‌ జహంగిరిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ప్రకటించారు. 
 
ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు వచ్చిన బహుమతులను 'తోషాఖానా' నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలోనే కేసు నమోదైంది. ఈ కేసులో ఇస్లామాబాద్‌లోని జిల్లా, సెషన్స్‌ కోర్టు ఆగస్టు 5న ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. 
 
అంతేకాకుండా ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. తీర్పు వెలువడిన వెంటనే అరెస్టయిన ఇమ్రాన్‌.. ప్రస్తుతం పంజాబ్‌ ప్రావిన్స్‌లోని అటక్‌ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రయల్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేయగా.. ఇస్లామాబాద్ హైకోర్టు దాన్ని నిలిపేసింది. దీంతో ఇమ్రాన్ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు సంబరాల్లో మునిగిపోయారు.