1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 26 జూన్ 2023 (16:55 IST)

37 యేళ్ల క్రితం నాటి కేసులో నిర్దోషిగా నవాజ్ షరీఫ్

nawaz sharief
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ ఓ కేసులో నిర్దోషిగా బయటపడ్డారు. 37 యేళ్ళ క్రితం నాటి కేసులో ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ లాహోర్‍‌లోని అకౌంటబిలిటీ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఆయన 37 ఏళ్ల కిత్రం ఆయన పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6.75 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని జియో మీడియా సంస్థ యజమాని మీర్ షకీర్ ఉల్ రహ్మను లంచంగా ఇచ్చారంటూ నేషనల్ ఆకౌంటబిలిటీ బ్యూరో కేసు పెట్టింది. 
 
దురుద్దేశాలతోనే ఆ బ్యూరో కేసు పెట్టిందని షరీఫ్ తరపు న్యాయవాది వాదించారు. 1986లో ఆయన లాహోర్ డెవలప్మెంట్ ఆథారిటీ చైర్మన్‌గా ఉన్నప్పటికీ స్థలం కేటాయింపులో ఎలాంటి పాత్ర లేదని చెప్పారు. ఈ కేసులో మీడియా సంస్థ యజమానిని ఇంతకుముందే నిర్దోషిగా ప్రకటించారని, అందువల్ల ఈ కేసును కొనసాగించాల్సిన అవసరం లేదని తెలిపారు. 
 
మరోవైపు ఇటీవల చట్టానికి చేసిన సవరణల కారణంగా భూముల కేటాయింపు వ్యవహారం తమ పరిధిలోకిరాదని అకౌంటబిలిటీ బ్యూరో కూడా కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్‌‍ను నిర్దోషిగా ప్రకటిస్తూ శనివారం కోర్టు తీర్పు ఇచ్చింది. నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం పాక్ ప్రధానిగా వ్యవహరిస్తుండం గమనార్హం. అలాగే, అవినీతి కేసుల్లో శిక్షపడిన రాజకీయనాయకులు జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా విధించిన నిషేధాన్ని కూడా ఎత్తివేస్తూ మరో చట్టానికి కూడా షెహబాజ్ ప్రభుత్వం సవరణ చేసింది. ఈ కారణంగా నవాజ్ షరీఫ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఏర్పడింది.