ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 10 జులై 2021 (07:09 IST)

ఆ ద్రాక్ష కిలో రూ.7.5 లక్షలు..!

మామూలుగానే ద్రాక్ష రుచిగా ఉంటుంది. తగిన ధరలో కొంటూ ఆ రుచిని ఆస్వాదిస్తాం.. ఓ చోట ద్రాక్ష ప్రత్యేకతే వేరు. ఆ ద్రాక్ష పేరు రూబీ రోమన్‌. ఈ ద్రాక్ష కిలో ధర 11 వేల డాలర్లు. అంటే అక్షరాలా రూ.7.5 లక్షలు. ఇది నిజమండీ... అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా ఖ్యాతి దక్కించుకుంది.

జపాన్‌లో 2019లో ఈ ద్రాక్ష రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఇంతకీ ఏంటబ్బా అంత ప్రత్యేకత ఆ ద్రాక్షలో అనుకుంటున్నారా.. అవునండీ.. ఆ ద్రాక్ష ప్రత్యేకతే వేరు.. ఇంత రేటు పలుకుతున్నా ఆ ద్రాక్షను కొనడానికి జనం క్యూ కడుతున్నారండోయ్..
 
పాపులర్‌ టేస్ట్‌..
రూబీ రోమన్‌ ద్రాక్ష అని పిలిచే ఈ ద్రాక్ష తక్కువ పుల్లగా, ఎక్కువ తీపిగా, జ్యూసీగా జ్యూసీగా ఉంటుంది. అందుకే అంత పాపులర్‌. చక్కటి రంగు, రుచితో పింగ్‌పాంగ్‌ బంతి సైజులో ఉంటుంది ఈ 'రూబీ రోమన్‌ ద్రాక్ష'. ఈ రకానికి చెందిన ప్రతి ద్రాక్ష బరువు 20 గ్రాముల కంటే ఎక్కువే. రుచిలో కూడా రాయల్‌గా ఉంటాయి. అయితే వీటిని కొనాలంటే మాత్రం జేబుకు భారీ చిల్లు తప్పదు. ఐఫోన్‌, తులం బంగారం కంటే ఎక్కువ పెట్టాల్సిందే మరి.
 
ఎక్కడ పండిస్తారంటే..
జపాన్‌లోని ఇషికావా దీవిలో పరిమిత సంఖ్యలో రుబీ రోమన్‌ ద్రాక్ష పండ్లను పండిస్తారు. 2008 నుంచి ఈ ద్రాక్షలను పండించడం ప్రారంభించారు. జపనీస్‌ లగ్జరీ ఫ్రూట్‌ మార్కెట్లో వీటికి చాలా డిమాండ్‌. ఈ ద్రాక్షను మొదట మార్కెట్లో విక్రయించారు. వేలంలో అధిక ధర చెల్లించినవారికి మాత్రమే ఇది సొంతం. అందుకే దీన్ని కొనడానికి ఔత్సాహికులు క్యూ కడతారు. అంత డిమాండ్‌ ఉంది ఈ ద్రాక్షకు.
 
విఐపి లకు గిఫ్ట్‌లుగా..
సాధారణ రోజుల్లో ఈ ద్రాక్ష గుత్తి ధర 460 డాలర్లు (రూ.31,537) వరకు ఉంటుందని స్థానిక రైతులు చెప్పారు. అలాగే వీటిని ఎక్కువగా ఇతరులకు బహుమతిగా ఇచ్చేందుకు కొనుగోలు చేస్తారనీ, విఐపి గెస్టులకు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు కొన్ని విలాసవంతమైన హౌటల్స్‌ కొనుగోలు చేస్తుంటాయని తెలిపారు.
 
ఒక ద్రాక్ష ధర సుమారు రూ.35 వేలు పలికింది..
2019లో ఈ ద్రాక్షను కనజవాలో వేలానికి పెట్టగా, జపాన్‌కు చెందిన హయాకురాకుసో అనే సంస్థ ఈ ద్రాక్ష గుత్తిని వేలంలో గెలుచుకుంది. మొత్తం 24 ద్రాక్ష పండ్ల గుత్తిని 12 లక్షల యెన్లకు సొంతం చేసుకుంది. అంటే ఒక ద్రాక్ష ధర సుమారు రూ.35 వేలన్న మాట. మార్కెట్లో ప్రవేశపెట్టిన గత 11 ఏళ్లలో ఎన్నడూ ఇంత ధర పలకలేదని నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ కో ఆపరేటివ్‌ అసోసియేషన్‌ వెల్లడించింది.