1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 ఆగస్టు 2021 (14:30 IST)

తాలిబన్ల కాల్పులు.. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద తొక్కిసలాట

తాలిబన్ తీవ్రవాదుల వశమైన ఆప్ఘనిస్థాన్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఆప్ఘన్ దేశాన్ని తాలిబన్ల ఆక్రమణ తర్వాత ఆ దేశాన్ని వీడేందుకు పెద్ద ఎత్తున ఆప్ఘన్ పౌరులు కాబూల్‌ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.
 
తాలిబన్ల అరాచకాలతో దేశం విడిచి వెళ్లేందుకు అఫ్గన్ పౌరులు కాబూల్ విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. ముష్కరుల దురాగతాల నుంచి తప్పించుకోవాలనే తాపత్రయంలో ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారు. 
 
గతవారం బయలుదేరుతున్న అమెరికా విమానం రెక్కలపైకి ఎక్కి వెళ్లేందుకు ప్రయత్నించి ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాజాగా, కాబూల్ విమానాశ్రయానికి భారీ సంఖ్యలో జనం చేరుకోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అఫ్గన్ పౌరులు మృతిచెందారు.
 
విమానాశ్రయానికి జనం పోటెత్తడంతో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపడం వల్ల పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు బ్రిటన్ రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో ఏడుగురు అఫ్గన్ పౌరులు చనిపోయారని, మరికొందరు గాయపడ్డారని తెలిపింది.