1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 28 ఆగస్టు 2021 (17:30 IST)

వారం రోజుల్లో అవన్నీ అప్పగించారో సరే, లేదంటేనా?: ఆఫ్ఘన్ ప్రజలకు తాలిబన్లు వార్నింగ్

ఆఫ్ఘనిస్తాన్ అల్లకల్లోలం అయిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్ ప్రభుత్వం తాలిబన్ల దెబ్బకు కుప్పకూలిపోవడమే కాకుండా అధ్యక్షుడుతో పాటు ఎందరో ప్రభుత్వ అధికారులు పారిపోయారు. దీనితో ప్రభుత్వ ఆస్తులను ప్రజలు ఇష్టారాజ్యంగా తీసుకుని వెళ్లిపోయారు. కార్లు, ఆయుధాలు, వస్తువులు.. ఇలా ఒకటేమిటి ఎన్నో కబ్జా చేసేసారు.
 
కార్లు ఇతర సామాగ్రి సంగతి ఎలా వున్నా మారణాయుధాలను తీసుకుని వెళ్లి దాచుకోవడం తాలిబాన్లకు ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తులో వాటితో తమపై ప్రజలు తిరుగుబాటు చేస్తారన్న భయంతో వారు వున్నట్లు తెలుస్తోంది.
 
మరోవైపు తాలిబన్లుకు వ్యతిరేకంగా వున్న కొన్ని దేశాలు వీరికి కాస్త వెన్నుదన్నుగా నిలిస్తే ఇక ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ తాలిబన్ల పోరాటంగా మారే అవకాశం వుందన్న భయం వారిని వీడుతోంది. అందుకే మరో వారం రోజుల్లో ప్రభుత్వ ఆస్తులన్నిటినీ తీసుకు వచ్చి అప్పగించాలని తాలిబన్లు వార్నింగ్ ఇచ్చారు. మరి వారి వార్నింగులను ప్రజలు పట్టించుకుంటారో లేదో వారం తర్వాత కానీ తెలియదు.