1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (13:21 IST)

అమెరికా - బ్రిటన్‌లకు తాలిబన్ల హెచ్చరిక.. గడువు పొడగించారో...

ఆప్ఘనిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్ తీవ్రవాదులు అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్ దేశాలకు గట్టి హెచ్చరిక చేశాయి. నిర్ధేశించిన గడువు అంటే ఆగస్టు 31వ తేదీలోగా ఆప్ఘాన్ గడ్డను వీడి వెళ్లిపోవాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాయి. 
 
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ గతంలో చెప్పిన ఆగస్ట్‌ 31 నాటికి ఆ దేశ బలగాల ఉపసంహరణ పూర్తి కావాలని డిమాండ్‌ చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న సైన్యాన్ని పూర్తిగా వెనక్కి రప్పించేందుకు ఆగస్టు 31వ తేదీ కంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందన్న బైడెన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో తాలిబన్లు తాజాగా ఈ హెచ్చరిక చేయడం గమనార్హం. 
 
ఒప్పందం ప్రకారం తన బలగాలను అమెరికా పూర్తిగా వెనక్కి రప్పించిన తర్వాతే తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అమెరికా సైన్యం ఉపసంహరణ పూర్తికానంత వరకు తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఈ నేపథ్యంలో ఆప్ఘనిస్థాన్‌ నుంచి సైన్యం ఉపసంహరణకు నిర్దేశించిన ఆగస్టు 31 గడువును మరింత పొడిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికాకు తాలిబన్లు హెచ్చరించారు.