1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఆప్ఘన్‌లో మహిళలు బయటకు రావొద్దు.. తాలిబన్ల హుకుం

తాలిబన్ తీవ్రవాదుల వశమైన ఆప్ఘనిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ క్షీణించిపోతున్నాయి. ఆప్ఘన్ ప్రజలు పూర్తిగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోల్పోయి బిక్కుబిక్కుమంటూ తమతమ ఇళ్ళలో జీవిస్తున్నారు. తాలిబన్ తీవ్రవాదుల ఆంక్షలు క్రమంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకు రావొద్దని హెచ్చరించారు. ఇళ్లలోనే ఉండాలని, భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే బయటకు రావాలని తాలిబన్లు ఆదేశాలు జారీచేశారు. 
 
మరోవైపు, అఫ్గానిస్థాన్‌ నుంచి తరలింపు ప్రక్రియను అమెరికా ఈ నెల 31 కల్లా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ డెడ్‌లైన్‌ను పొడిగించేందుకు తమ గ్రూపు అంగీకరించదని తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ స్పష్టంచేశారు. 
 
అఫ్గానిస్థాన్‌లో జనజీవనానికి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని.. అయితే, విమానాశ్రయం వద్ద ఆందోళనకర పరిస్థితులు అందుకు ఆటంకంగా మారాయన్నారు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో అనేకమంది ప్రజలు భయంతో దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.