1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 జనవరి 2024 (20:03 IST)

ఇరాన్‌లో భారీ పేలుళ్లు.. 100 మందికి పైగా మృతి

bomb blast
ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సులేమానీ సంస్మరణ కార్యక్రమంలో పెను విషాదం చోటుచేసుకుంది. కెర్మాన్‌లోని ఆయన సమాధి సమీపంలో సంభవించిన జంట పేలుళ్లలో వంద మందికి పైగా మృతి చెందారు. మరో 170 మందికిపైగా గాయపడినట్లు అధికారిక మీడియా తెలిపింది. ఇజ్రాయెల్‌ - హమాస్‌ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ పేలుళ్లు జరిగాయి. గాజాపై దాడులను ఇరాన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
 
ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌లోని అత్యంత శక్తిమంతమైన ఖుద్స్‌ ఫోర్స్‌కు నేతృత్వం వహించిన ఖాసీం సులేమానీ.. 2020 జనవరి 3న అమెరికా డ్రోన్‌ దాడిలో మృతి చెందారు. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ దాడికి అప్పటి అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఆదేశాలు ఇచ్చారు. 
 
దానిపై అప్పట్లో ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. తాజాగా సులేమానీ నాలుగో వర్థంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పేలుళ్లు సంభవించాయి. ఇదిలావుంటే, 2020లో ఆయన అంత్యక్రియల సమయంలోనూ తొక్కిసలాట జరిగి 56 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఇపుడు జరిగిన జంట పేలుళ్ళలో వంద మంది వరకు చనిపోవడం గమనార్హం.