శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (10:09 IST)

సిరియాలో రసాయన దాడి... క్షిపణులతో విరుచుకుపడిన అమెరికా సైన్యం

సిరియాపై ప్రపంచ పెద్దన్న కన్నెర్ర జేసింది. సిరియాలోని ఖాన్‌షిఖావున్ నగరంపై జరిగిన రసాయన దాడిలో మొత్తం 70 మందికి పైగా చనిపోగా... అందులో చాలామంది ముక్కుపచ్చలారని చిన్నారులే ఉండటంతో ప్రపంచం యావత్తూ కలవరప

సిరియాపై ప్రపంచ పెద్దన్న కన్నెర్ర జేసింది. సిరియాలోని ఖాన్‌షిఖావున్ నగరంపై జరిగిన రసాయన దాడిలో మొత్తం 70 మందికి పైగా చనిపోగా... అందులో చాలామంది ముక్కుపచ్చలారని చిన్నారులే ఉండటంతో ప్రపంచం యావత్తూ కలవరపాటుకు గురైంది. ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా... ప్రత్యక్ష కార్యాచరణంలోకి దిగింది. 
 
అయితే, సిరియాలో తిరుగుబాటు శిబిరాలపై రసాయన దాడుల పాపం ఆ దేశ అధ్యక్షుడు చేసిన పనేనని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సిరియా వైమానిక స్థావరాలపై క్షిపణులతో అమెరికా విరుచుకుపడుతోంది. సిరియా అధ్యక్షుడి నేతృత్వంలో నడిచే ఈ వైమానిక స్థావరం నుంచే రసాయన దాడులు జరగడం గమనార్హం. 
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు క్షిపణిదాడులు ప్రారంభించినట్టు అమెరికా సైనికాధికారి ఒకరు వెల్లడించారు. మధ్యదరాసముద్రంలో అమెరికా యుద్ధ నౌక నుంచి మొత్తం 50 వరకు తోమాహక్ క్షిపణులను సిరియా పైకి ప్రయోగించినట్టు చెప్పారు. 
 
కాగా ఈ క్షిపణి దాడుల్లో ఎంత మంది చనిపోయారు, ఎలాంటి నష్టం జరిగిందన్న దానిపై వివరాలు రావాల్సి ఉంది. గత మూడు రోజుల క్రితం తిరుగుబాటు దారులపై సిరియాలో జరిగిన రసాయన దాడిపై అసద్‌ను తప్పు పట్టిన మరుసటి రోజే ట్రంప్ క్షిపణి దాడులకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.