1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (18:49 IST)

ఆస్ట్రేలియాలో కొత్త వైరస్.. రొయ్యలు, పీతలు చచ్చిపోతున్నాయ్!

ప్రపంచ దేశాలను ఇప్పటికే కరోనా వైరస్, బర్డ్ ఫ్లూ వైరస్‌లు వణికిస్తున్నాయి. ఇవి చాలదన్నట్లు మరో వైరస్ కూడా శరవేగంగా వ్యాపిస్తోంది. ఆస్ట్రేలియా ఆక్వాకల్చర్ ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆస్ట్రేలియాలో ఆక్వాకల్చర్‌ను పలు రోగాలు పట్టిపీడిస్తున్నాయి. ఇక్కడి సౌత్-ఈస్ట్ క్వీన్స్ ల్యాండ్‌లో రొయ్యలు, పీతలకు తెల్ల మచ్చల వ్యాధి పెద్ద ఎత్తున సోకుతోంది. 
 
ఈ వైట్ స్పాట్ వైరస్‌తో ఇక్కడి ఆక్వాకల్చర్ నష్టాల్లో మునిగిపోతుండగా విదేశాల నుంచి రొయ్యలు, పీతల దిగుమతికి విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. బయోసెక్యూరిటీ లోపించటంతోనే మెరైన్ ఫుడ్ ఇలా విషపూరితంగా మారుతోందనే ఆందోళన ఇప్పుడు ఆస్ట్రేలియాను పట్టిపీడిస్తోంది. 2016లోనూ ఇలాంటి వైట్ స్పాట్ వైరస్ ఇక్కడి ఆక్వా రంగాన్ని కుదేలు చేసింది. 
 
ముఖ్యంగా ఇక్కడ ఉన్న లోగన్ నది పరివాహక ప్రాంతంలో ఇప్పుడు ఈ వైరస్ కబళించేసింది. అయితే ఇప్పట్లో ఈ వ్యాధి తగ్గదని ఆస్ట్రేలియాలో మెరైన్ ఫుడ్ ఎక్స్ పర్ట్స్ రైతులను అప్రమత్తం చేస్తున్నారు.
 
ఈ వైట్ స్పాట్ వైరస్‌తో  రొయ్యలు, పీతలు వంటి వాటి శరీరం, మొప్పలు ఎరుపు లేదా గోధుమ రంగులోకి మారతాయి. చెరువు గట్ల దగ్గరకువచ్చి రొయ్యలు ఎక్కువగా చనిపోతాయి. ఈ వ్యాధికి చిక్సిత లేదు. కాబట్టి ఉత్తమ మార్గంగా పంటల మధ్య కనీసం 2 నెలలు విరామం ఇస్తారు. ఈనేపథ్యంలో ఇక్కడి చాలా రొయ్యల చెరువులు ఇప్పుడు పంట పెట్టడాన్ని నిలుపుదల చేశారు. బయోసెక్యూరిటీ లోపిస్తే ఆక్వా పంట ఇలా వైరస్ పాలవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.