రజనీకాంత్ 'జైలర్ 2' చిత్రీకరణ పూర్తి
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జైలర్-2. ఈ చిత్రం చిత్రీకరణ పనులు పూర్తి చేసుకుంది. నెలన్స్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ నిర్మాణ వ్యయంతో నిర్మించింది.
తాజాగా 'జైలర్ 2' షూటింగ్ పూర్తయినట్లు టీమ్ తెలిపింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది ఏప్రిల్లోనే పూర్తయింది. కానీ, నెల్సన్ ఈ కథలో మరికొన్ని కొత్త సన్నివేశాలు యాడ్ చేసి 25 రోజుల పాటు మళ్లీ షూటింగ్ నిర్వహించారు. తాజాగా అవి కూడా పూర్తయినట్లు చిత్రబృందం పేర్కొంది.
ఈ చిత్రంలో హృతిక్ రోషన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయన చెన్నై రావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ 25 రోజుల షెడ్యూల్లో ఆయనకు సంబంధించిన సన్నివేశాలనే చిత్రీకరించారని సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
'జైలర్'లో పలు భాషలకు చెందిన అగ్రతారలు అతిథి పాత్రల్లో మెరిసిన విషయం తెలిసిందే. రెండో భాగంలోనూ ఆ సందడి కొనసాగనుంది. సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కూడా ఇందులో కీలకపాత్రలో కనిపించనున్నారు. మొదటి భాగం ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే సీక్వెల్ ప్రారంభమవుతుందని గతంలో శివరాజ్ కుమార్ తెలిపారు.
