గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By pnr

ఐపీఎల్ 2017 : ముంబై చిత్తు.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఫైనల్‌కు పూణె

ఐపీఎల్‌ పదో సీజన్‌ క్వాలిఫయర్‌-1 పోరులో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ అదరగొట్టింది. ముంబైపై గెలిచి ఫైనల్‌కు చేరింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో రాణించిన ఆజట్టు 2

ఐపీఎల్‌ పదో సీజన్‌ క్వాలిఫయర్‌-1 పోరులో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ అదరగొట్టింది. ముంబైపై గెలిచి ఫైనల్‌కు చేరింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో రాణించిన ఆజట్టు 20 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. ఫలితంగా ఐపీఎల్‌ పదో సీజన్ చాంపియన్‌గా నిలిచేందుకు పుణె అడుగు దూరంలో నిలిచింది. 
 
పుణె నిర్దేశించిన 163 పరుగుల లక్ష్య ఛేదనలో వాషింగ్టన్ సుందర్‌ (4-0-16-3) ధాటికి ముంబై ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 142 రన్స్ మాత్రమే చేయగలిగింది. పార్థివ్‌ పటేల్‌ (40 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 52) ఒంటరి పోరాటం నిష్ఫలమైంది. మిగతా బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. ఠాకూర్‌ (3/37) మూడు వికెట్లతో సత్తా చాటాడు. 
 
మొదట బ్యాటింగ్‌ చేసిన పుణె నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 162 పరుగులు చేసింది. మనోజ్‌ తివారి (48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 58), అజింక్యా రహానే (43 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 56) అర్థ శతకాలతో ఆకట్టుకోగా.. ఆఖర్లో ధోనీ (26 బంతుల్లో 5 సిక్సర్లతో 40 నాటౌట్‌) ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. 
 
వాషింగ్టన్ సుందర్‌కు మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా ఫైనల్‌ చేరేందుకు ముంబైకి మరో అవకాశం ఉంది. బుధవారం కోల్‌కతా-హైదరాబాద్‌ మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్ విజేతతో రెండో ఫైనల్‌ బెర్తు కోసం 19న జరిగే క్వాలిఫయర్‌-2లో ఆ జట్టు పోటీ పడనుంది.