1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (19:50 IST)

ఐపీఎల్ పోటీల రీషెడ్యూల్ ఖరారు - బయోబబుల్స్ నిబంధనలు ఖరారు (video)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలు తిరిగి ప్రారంభంకానున్నాయి. గత ఏప్రిల్ - మే నెలల్లో ప్రారంభమైన ఈ పోటీలు కరోనా వైరస్ రెండో దశ అల కారణంగా వాయిదాపడిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ పోటీలను తిరిగి నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. 
 
ఇందులోభాగంగా, ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కోసం బీసీసీఐ బయో బబుల్ నిబంధనలు విడుదల చేసింది. తాజా బయో బబుల్ ప్రకారం… విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌కు వచ్చే 72 గంటల ముందు కొవిడ్ ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి.
 
ఆర్టీ పీసీఆర్ టెస్టు వచ్చేవరకు క్రికెటర్లు, సహాయ సిబ్బంది స్వీయనిర్బంధంలో ఉండాలి. ఆర్టీ-పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చిన వారు తమ ఫ్రాంచైజీకి కేటాయించిన నగరానికి చేరుకోవచ్చు. నెగెటివ్ వచ్చిన వారికి ఎలాంటి క్వారంటైన్ అమలు చేయరు. 
 
విదేశీ క్రికెటర్లు దుబాయ్ ఎయిర్ పోర్టులో తమ ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగెటివ్ రిపోర్టును చూపించాల్సి ఉంటుంది. ఒక్కసారి బయో బబుల్‌లో ప్రవేశించాక, ఏదైనా అనివార్య కారణాలతో తప్ప మరే ఇతర కారణాలకు బయటికి పంపించడం కుదరదు. 
 
బబుల్ నుంచి బయటికి వచ్చేవారు బీసీసీఐ వైద్యాధికారి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. తిరిగి బయో బబుల్‌లో ప్రవేశించాలంటే 6 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. పైగా వారికి 2వ, 4వ, 6వ రోజు నిర్వహించే ఆర్టీ-పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వస్తేనే బబుల్‌లోకి ప్రవేశం కల్పిస్తారు.