శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2021 (22:03 IST)

ఐపీఎల్ 2021: ఫిబ్రవరి 18న వేలం పాట.. వేదికపై ఇంకా..?

IPL 2021
కాసుల వర్షం కురిపించే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021 కోసం వేలం పాట త్వరలో ప్రారంభం కానుంది. గత ఏడాది కరోనా కారణంగా లేటుగా ప్రారంభమైన ఐపీఎల్ 2020.. విజయవంతంగా ముగిసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను అట్టహాసంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ అట్టిపెట్టుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలను విడుదల చేశాయి. కాగా ఫిబ్రవరి 18న ఐపీఎల్‌ వేలం జరగనుందని సమాచారం.
 
'ఐపీఎల్‌ వేలం ఫిబ్రవరి 18న జరుగుతుంది. వేదిక ఇంకా నిర్ణయించలేదు' అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే పొట్టి క్రికెట్‌ నిర్వహించే వేదికపై ఇంకా స్పష్టత లేదు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ భారత్‌లోనే ఘనంగా నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నామని చెప్పిన సంగతి తెలిసిందే.
 
కరోనా వైరస్‌ వల్ల గతేడాది ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించారు. అత్యంత ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో ముంబై ఇండియన్స్‌ విజేతగా ఆవిర్భవించింది. ట్రోఫీని నిలబెట్టుకుంది. యువకులతో కూడిన దిల్లీ క్యాపిటల్స్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఐపీఎల్‌ రీటెన్షన్‌ తుది గడువు జనవరి 20తో ముగియడంతో జట్లన్నీ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా విడుదల చేశాయి.