గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఏది నిజం
  3. ఇదీ సంగతి
Written By ఎం
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2019 (10:52 IST)

రాధ కృష్ణుడికి ఎందుకు దూరమైంది?

యుగాలు మారినా ప్రపంచంలో మారనిది ప్రేమ భావన ఒక్కటే. ఈ భూమి మీద మానవులు ఉన్నంత కాలం ప్రేమ కూడా ఉంటుంది. ప్రేమకు నిర్వచనం ఏమిటని ఎవరైనా అడిగితే ‘‘రాధ’’ అనే రెండక్షరాలు సరిపోతాయి. ప్రేమంటేనే రాధ. రాధంటేనే ప్రేమ. ఇంతకు మించిన నిర్వచనం ప్రపంచంలోనే లేదు. అలాంటి రాధ కృష్ణుడితో చివరంటా ఎందుకు లేదు. బృందావనంలో కృష్ణుడితో ఉన్న రాధ తరువాత ఏమైంది?
 
బృందావనంలో కృష్ణుడితో ఎంతమంది గోపికలు ఉన్నా అతను మాత్రం రాధతోనే అలౌకిక ఆనందం పొందేవాడు. అక్కడికి సమీపంలోని వ్రేపల్లె అనేచిన్న గ్రామంలో రాధ ఉండేది. రాధ కృష్ణుడి కంటే పదేళ్లు పెద్దది. అయినా వారి ప్రేమకు వయసు అడ్డురాలేదు. 
 
కంసుడు కృష్ణుడిని మధురకు తీసుకురమ్మని అక్రూరుడిని బృందావనం పంపుతాడు. గోపికలంతా ఏడుస్తూ వెళ్లవద్దని కోరతారు. వారిని ఎలాగోతప్పించుకుని కృష్ణుడు వ్రేపల్లె వెళతాడు. అక్కడ కేవలం 5 నిముషాలు మాత్రమే ఉంటాడు. ఇద్దరూ మౌనంగా ఒకరినినొకరు చూసుకుంటారు.

రాధ ఒక్క ప్రశ్న కూడా కృష్ణుడిని అడగదు. అతను వెళ్లవలసిన అవసరం ఏమిటో ఆమెకు బాగా తెలుసు. అంతేకాదు భౌతికంగా దూరంగా ఉన్నాకృష్ణుడి నుంచి తాను దూరం కానని కూడా ఆమెకు తెలుసు. వారిద్దరి మనసులూ ఎప్పుడో కలిసిపోయాయి. అలాంటప్పుడు మాటలతో వారికేం పని?
 
గోపికలందరినీ సమాధానపరిచి కృష్ణుడు బలరాముడు వెంటరాగా అక్రూరునితో పాటు బృందావనం విడిచి వెళతాడు. కృష్ణుడు కంసుడిని చంపుతాడు. మరికొంత కాలానికి శిశుపాలుడిని చంపుతాడు. ఇతర అనేకానేకమంది రాక్షసులను సంహరిస్తాడు. మధురనుచక్కదిద్దుతాడు.  కొంతకాలానికి ద్వారకను నిర్మించి కృష్ణుడు అక్కడకు మారిపోతాడు. అలా ఏళ్లు గడుస్తాయి.
 
మరి రాధ ఏమైంది? ఆమె నిరంతరం కృష్ణుడిని ధ్యానిస్తూ అతన్నే మనసులో నిలుపుకుని సదా అదే స్మరణలో జీవిస్తూ ఉంటుంది. అది చూసి భయపడిన ఆమె తల్లి రాధకు బలవంతంగా పెళ్లి చేస్తుంది. తల్లి కోరిక మేరకు రాధ పెళ్లి చేసుకుని పిల్లలను కూడా కంటుంది
 
కాల గతిలో ఏళ్లు గడుస్తాయి. రాధ పిల్లలు పెద్దవుతారు. పెళ్లిళ్లు కూడా జరుగుతాయి. రాధకు వయసుపైబడి బలహీనపడుతుంది. ఆ స్థితిలోచనిపోయేలోగా కృష్ణుడిని చూడాలని రాధ బలంగా భావిస్తుంది. రాత్రికి రాత్రి ఇల్లు విడిచిపెట్టి కాలినడకన ద్వారక చేరుతుంది. ఎలాగో కృష్ణుడిని కలుసుకుంటుంది.
 
ఏళ్లు గడిచినా వారిద్దరి మధ్య మానసిక సాన్నిహిత్యం మాత్రం మారలేదని గ్రహించి ఆనందపడుతుంది. అయినా చివరలో కొన్నాళ్లు కృష్ణుడి సన్నిధిలో ఉండాలని తపిస్తుంది. రాజభవనంలో పరిచారికగా చేరుతుంది. ఆమె ఎవరో కృష్ణుడికి తప్ప ఎవ్వరికీ తెలీదు.
 
కొన్నాళ్లకు రాధ భౌతికంగా స మీపంగా ఉన్నంత మాత్రాన వచ్చేదేం లేదని, మానసిక సాన్నిహిత్యమే తనకు ఇంతకు మించినసంతోషాన్ని ఇచ్చిందని గ్రహిస్తుంది దీంతో ఎవరికీ చెప్పకుండా రాజభవనం వీడి బయటకు వచ్చేస్తుంది.
 
వయసు మీదపడటం, శారీరక దుర్భలత్వం రాధను వివశురాలిని చేస్తాయి. తనకు అంత్య ఘడియాలు సమీపించాయని గ్రహిస్తుంది. ఆ స్థితిలో ఆమె ముందు కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. తన దివ్య కరస్పర్శతో ఆమెను పునీతురాలిని చేస్తాడు.

ఆమె ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పమని కోరతాడు. నీ స్పర్శతోనే అన్ని కోరికలూ తీరిపోయాయని, దివ్యదర్శనం జరిగిందని అంటుంది. అయినా బలవంతపెట్టటంతో చివరిసారి మురళీగానం వినాలనికోరుతు౦ది
 
ఆమె కోసం కృష్ణుడు ప్రత్యేకంగా ఎన్నడూ ఎవరూ వినని దివ్య విశ్వగానం వినిపిస్తాడు. దాంతో భవబంధాలన్నీ తీరిపోయి రాధ కృష్ణుడిలో ఐక్యం అవుతుంది. ఆమె కోసం వాడిన వేణువును మళ్లీ వాడనని కృష్ణుడు దాన్ని విరిచి పడేసి అక్కడినుంచి తన నివాసానికి వెళ్లిపోతాడు.