గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : బుధవారం, 22 మే 2019 (15:04 IST)

రెండు సింహాలను ఢీకొట్టిన లేడీ టైగర్.. బెంగాల్‌లో సర్వత్రా ఉత్కంఠ

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడికానున్నాయి. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రతి ఒక్కరి దృష్టి వెస్ట్ బెంగాల్‌పై కేంద్రీకృతమమైంది. దీనికి కారణం కమ్యూనిస్టుల కంచుకోటను టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బద్ధలుకొట్టారు. ఇపుడు ఈమె బెంగాల్ రాణీగా ఉన్నారు. ఇక్కడ కమలనాథులు పాగా వేయాలని భావించారు. అంతే.. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు ఈ రాష్ట్రంలో గురిపెట్టారు. ఫలితంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారమే హోరాహోరీగా సాగింది. 
 
ఇద్దరు ఉద్ధండులైన మోడీ - అమిత్ షాలతో లేడీ టైగర్‌ మమతా బెనర్జీ ఢీ అంటే ఢీ అన్నారు. ఒక సందర్భంలో అమిత్ షా హెలికాఫ్టర్‌ను కూడా బెంగాల్ గడ్డపై ల్యాండ్ కానివ్వలేదు. అంతేనా అమిత్ షా రోడ్డు షో నిర్వహించేందుకు కూడా మమతా బెనర్జీ చుక్కలు చూపించారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమిత్ షా బెంగాల్‌లో ఎన్నికల ప్రచారాన్ని పూర్తిచేశారు. అలా సర్వత్రా ఉత్కంఠను రేపిన బెంగాల్ ఎన్నికలపై ఇపుడు ప్రతి ఒక్కరి దృష్టి కేంద్రీకృతవైుంది. 
 
ఈ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన సీట్లు సాధిస్తుందన్న నమ్మకంతో కమలనాథులు ఉన్నారు. ఖచ్చితంగా రెండంకెల సీట్లు వస్తాయన్న భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. బెంగాల్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. ఏడు విడతల్లో పోలింగ్ జరగ్గా ప్రతి విడతలో ప్రతి నియోజకవర్గంలో ఇరువురు నేతలు పర్యటించారు. 
 
మమతా బెనర్జీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల ప్రచారం సాగించారు. బెంగాల్ అభివృద్ధికి దీదీ స్పీడ్ బ్రేకర్‌గా మారారంటూ విమర్శలు ప్రారంభించిన బీజేపీ చివరకు మమతా అవినీతి పాలనకు ముగింపు పలకాలంటూ పిలుపునిచ్చింది. ప్రచారం సందర్భంగా ప్రధాని మోడీ, మమతల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. ప్రధాని ప్రతి మాటకు కౌంటర్ ఇస్తూ మమత ఎన్నికల ప్రచారం సాగించారు. ఇక అమిత్‌షా పర్యటనకు అనుమతి నిరాకరించడం ద్వారా రగిలిన చిచ్చు కోల్‌కతాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే దాక వచ్చింది. దీంతో ఈ సారి ఎన్నికలు బీజేపీ వర్సెస్ మమతగా జరిగాయి. 
 
ఒకానొక దశలో మమతా బెనర్జీని ఉమ్మడి శత్రువుగా భావించిన కాంగ్రెస్‌, వామపక్షాలు పరోక్షంగా బీజేపీకే మద్దతు కూడా ప్రకటించాయి. ఈ నేపధ్యంలోనే తాజాగా వెలువడిన ఎగ్జిట్ ఫలితాల్లో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు దక్కుతాయంటూ మెజార్టీ సర్వేలు వెల్లడించాయి. గడచిన ఎన్నికల్లో రెండు సీట్లకు పరిమితమైన బీజేపీ ఈ సారి 11 సీట్ల వరకు సాధిస్తుందని ఇదే సమయంలో దీదీ పార్టీకి 20 సీట్లు మాత్రమే దక్కుతాయనే భావిస్తున్నారు.